Oxygen Deficiency : ఢిల్లీలో ప్రాణాలు తీస్తున్న ఆక్సిజన్ కొరత

ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్ ఆస్పత్రులకు సరైన సమయంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా జరగకపోవడంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

Oxygen Deficiency : ఢిల్లీలో ప్రాణాలు తీస్తున్న ఆక్సిజన్ కొరత

Oxygen Deficiency

Corona patients die of oxygen deficiency in Delhi : ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్ ఆస్పత్రులకు సరైన సమయంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా జరగకపోవడంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది రోగులు నిన్న రాత్రి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మరో 200 మంది ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారు.. మరో అరగంటకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉండటంతో ఆస్పత్రి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. లక్షణం మెడికల్ ఆక్సిజన్ పంపాలని.. ఆస్పత్రి యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరుతోంది.

ఢిల్లీలో కరోనా పరిస్థితులు రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఓవైపు ఆక్సిజన్ సరఫరా డిమాండ్‌కు తగ్గ స్థాయిలో లేక.. కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతుంటే… మరోవైపు.. రోజురోజుకు పెరుగుతున్న యాక్టివ్ కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించే ఆలోచనలో ఉంది.

ఆరు రోజుల లాక్‌డౌన్‌ సోమవారం ఉదయం ముగుస్తుండటంతో మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించడంపై కేజ్రీవాల్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీలో యాక్టివ్ కేసులు లక్షకు చేరువలో ఉన్నాయి. టెస్టులు చేస్తున్న ప్రతి ముగ్గురులో ఒకరకి కరోనా పాజిటివ్ వస్తోంది. దీంతో లాక్‌డౌన్‌ను పొడిగించడం తప్ప మరో మార్గం లేదని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇవాళో రేపో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ దాదాపు అన్ని రాష్ట్రాల్లో విస్పోటనం సృష్టిస్తోంది. దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభాన్ని ఆక్సిజన్‌ కొరత మరింత తీవ్రతరం చేస్తోంది. ప్రాణవాయువు దొరక్క ఆక్సిజన్‌ అవసరం ఉన్న అన్ని రకాల రోగులు అల్లాడుతున్నారు. మెడికల్‌ ఆక్సిజన్‌ను వెంటనే పంపాలంటూ వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, ఇతర నేతలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్సిజన్‌ కోసం కేంద్రం కాళ్లు కూడా పట్టుకోవడానికి సిద్ధమేనని మహారాష్ట్ర హోంమంత్రి రాజేశ్‌ తోపే చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి.

సర్‌ గంగారం ఆసుపత్రిలో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి… ఈ ఆసుపత్రిలో 25 మంది కరోనా బాధితులు మృతి చెందారు.. మరో 60 మంది కరోనా బాధితుల జీవితాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ నిల్వలు పూర్తిగా అయిపోయాయి. సరిపడా ఆక్సిజన్‌ నిల్వ లేదని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్లు సమర్థంగా పనిచేయడం లేదని.. అత్యవసరంగా ఆక్సిజన్‌ తరలించాలని కోరారు.

దీంతో వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్‌ను పంపించింది. అటు మ్యాక్స్ హాస్పిటల్, సాకేత్ ఆస్పత్రికి కూడా కేంద్రం మెడికల్ ఆక్సిజన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చేసింది. అయితే కేంద్రం సరఫరా చేసిన ఆక్సిజన్‌ ప్రస్తుతమున్న కరోనా పేషెంట్లకే సరిపోతుందని మ్యాక్స్ యాజమాన్యం ప్రకటించింది. కరోనాతో ఆస్పత్రిలో ప్రస్తుతానికి ఎవరిని అడ్మిట్‌ చేసుకోమని తేల్చేసింది.