వరుడికి కరోనా పాజిటివ్…ఆగిపోయిన పెళ్లి
పెళ్లి కుమారుడితో పాటు అతడి తండ్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పెళ్లి వేడుకను మధ్యలోనే ఆపేశారు. వధువు ఇంటికి వారిని వెళ్లనివ్వలేదు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. యూపీలోని అమేథి జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఢిల్లీలో నివాసం ఉంటుంది. అయితే ఆ కుటుంబంలో ఓ యువకుడికి పెళ్లి సంబంధం కుదిరింది.
దీంతో జూన్ 15న వారు అమేథికి వచ్చి పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ కుటుంబానికి జూన్ 16న కరోనా పరీక్షలు నిర్వహించేందుకు.. వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. పెళ్లి వేడుక కోసం వరుడి కుటుంబ సభ్యులు.. వధువు ఇంటికి బయల్దేరారు. బరాబంకి జిల్లాలోని వధువు నివాసమైన హైదర్ గర్హ్ కు వెళ్తుండగా.. వరుడితో పాటు అతని కుటుంబాన్ని పోలీసులు మార్గమధ్యలోనే ఆపేశారు.
పెళ్లి కుమారుడికి, అతడి తండ్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. వారిద్దరిని ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. మరో 10 మందిని హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. పోలీసుల అప్రమత్తతో కరోనా నుంచి వధువుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు.