కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి నవంబర్ లోనే ప్రవేశించింది : ఎయిమ్స్ డైరెక్టర్

కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి నవంబర్ లోనే ప్రవేశించింది : ఎయిమ్స్ డైరెక్టర్

Corona strain enters India in November  : కరోనా స్ట్రెయిన్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ కు ముందే కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి ప్రవేశించిందని తెలిపారు. సెప్టెంబర్ నెలలో యూకేలో కరోనా స్ట్రెయిన్ వచ్చిందని చెప్పారు. కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి నవంబర్ నెలలోనే ప్రవేశించిందని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 20 కరోనా స్టెయిన్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. నవంబర్ నుంచి స్ట్రెయిన్ నమూనాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి వేగంగా జరుగుతుందన్నారు. కరోనా స్ట్రెయిన్ ప్రబలకుండా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు భారత్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతోంది. కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య దేశంలో ఇరవైకి పెరిగింది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన 20 మందికి కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది. హైదరాబాద్ సీసీఎంబీ సహా అనేక ల్యాబుల్లో మొత్తం 107 శాంపిళ్లను పరిశీలించారు. సీసీఎంబీలో పరిశీలించిన శాంపిళ్లలో ఇద్దరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, ఢిల్లీ తొమ్మిది, బెంగళూరులో ఏడు, హైదరాబాద్‌లో రెండు, కోల్‌కతాలో ఒకటి, పూణెలో ఒకటి, కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.

కొత్త స్ట్రెయిన్ సోకిన వారిని ప్రత్యేక గదుల్లో ఐసొలేషన్‌లో ఉంచారు వైద్యులు. బాధితుల కాంటాక్టులు గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కొత్త స్ట్రెయిన్ సోకిన వారిలో మీరట్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. తల్లిదండ్రులతో కలిసి ఇటీవల బ్రిటన్‌ నుంచి మీరట్ వచ్చిన ఓ చిన్నారికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారించారు. వారి తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ..వారికి కొత్త స్ట్రెయిన్ సోకలేదు.