అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ, పాఠశాలలే కరోనా టీకా కేంద్రాలు
Corona vaccination centers : కరోనా టీకా తయారీకి పరిశోధనలు జరుగుతుండగానే దేశంలో ప్రజలందరికీ టీకాలు వేసే కార్యక్రమం రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా పంపిణీకి ప్రణాళికను సిద్ధం చేసింది. టీకాలు వేసేందుకు ప్రతి గ్రామం, పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల భవనాలను ఉపయోగించాలని నిర్ణయించింది.
ఈ కార్యక్రమాన్ని కేంద్రం పరిధిలోని డిజిటల్ సంస్థ ‘ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్’ (ఈవిన్) ద్వారా పర్యవేక్షిస్తుంది. టీకాలు వేసేందుకు ఉపయోగించే భవనాలను గుర్తించే బాధ్యతను రాష్ర్టాలకు అప్పగించనున్నట్టు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కరోనా యాంటీబాడీలు పిల్లలు, పెద్దల్లో వేర్వేరుగా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. పిల్లల్లో వ్యాధి వ్యాప్తి, తీవ్రత తక్కువగా ఉంటుందని, కాబట్టి
వాళ్లు తొందరగా వైరస్ నుంచి కోలుకుంటారని కొలంబియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మాటియో వెల్లడించారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
కరోనా టీకా అందుబాటులోకి రాగానే వెంటనే వేసుకోవడానికి భారతీయులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని వరల్ట్ ఎకనామిక్
ఫోరం(డబ్ల్యూఈఎఫ్) జరిపిన అంతర్జాతీయ సర్వేలో తేలింది. టీకా ట్రయల్స్ వేగంగా జరగడం, సైడ్ ఎఫెక్ట్స్ భయంతో చాలా దేశాల్లో ప్రజలు టీకా వేసుకోకూడదని భావిస్తున్నారని సర్వే పేర్కొంది.