ఆసియాలో అతిపెద్ద మురికివాడ “ధారావి”లో 5కి చేరిన కరోనా కేసులు

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2020 / 01:38 PM IST
ఆసియాలో అతిపెద్ద మురికివాడ “ధారావి”లో 5కి చేరిన కరోనా కేసులు

ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొంది ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా కేసుల పెరుగుదల ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు ఈ మురికివాడలో నివసించే లక్షల మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. ధారావిలో కరోనా సోకి ఇటీవల ఓ వ్యక్తి ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే.

ముంబై నగరంలో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతుండటంతో పేదవారే కాదు మధ్య తరగతికి చెందిన చాలా మంది ఇక్కడకు వలస వచ్చారు. ఇక్కడ ప్రజలు దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి చేరుకుంటున్నా అక్కడ కనీస వసతుల గురించి ఎవరూ ఆలోచించలేదు. దీంతో ధారావి ప్రాంతం 1947 నాటికే దేశంలోనే అతి పెద్ద మురికివాడగా మారింది.

ఎటు చూసినా కిటకిటలాడుతున్న జనం. నడవడానికి వీల్లేని ఇరుకు రోడ్లు. కాస్తంత జాగా కనిపిస్తే ఇళ్ల నిర్మాణం మొదలైంది. నియమాలు, నిబంధనలు ఏమీ ఉండవు. అడిగే వాళ్లే లేరు. ఓ పద్ధతీ పాడు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇళ్లు కట్టేశారు. చిన్నపాటి ఇంట్లో పాతిక మంది దాకా సర్దుకోవాల్సిన పరిస్థితులు. ఇళ్లైతే కట్టారు కానీ కనీస వసతులను ఏమాత్రం పట్టించుకోలేదు. ధారావిలోని మెజారిటీ ఇళ్లల్లో టాయిలెట్ సౌకర్యం అనేదే ఉండదు.

పబ్లిక్ టాయిలెట్స్‌పై ఆధారపడటాన్ని జనం అలవాటు చేసుకున్నారు. దీంతో చాలాసార్లు అంటువ్యాధులు విజృంభించాయి. చాలా మంది మృత్యవాత పడ్డారు. ఇప్పుడు అక్కడ కరోనా వైరస్‌ ప్రవేశించింది. ప్రజలను కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా లక్షల మంది ప్రమాదంలో చిక్కుకోవడం ఖాయం. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడానికి యంత్రాంగం రెడీ అయింది.