దేశంలో కొత్తగా 12,881 కేసులు.. రికవరీ రేటు 52.95 శాతం
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,881 కేసులు నమోదయ్యాయి. అందులో 334 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం 3,66,946 మంది వ్యాధి బారిన పడ్డారు. మొత్తం 12,237 మంది చనిపోయారు. అయితే, కరోనా ప్రభావిత ప్రజల రికవరీ రేటు మరింత మెరుగుపడింది. ఈ రేటు ఇప్పుడు 52.95 శాతంగా ఉంది. బుధవారం ఈ రేటు 52.80 శాతంగా ఉంది.
ఇప్పటివరకు దేశంలో 1,94,325 మంది పూర్తిగా కోలుకోగా.. గత 24 గంటల్లో 7390 మంది ఈ వ్యాధి నుండి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,60,384 క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో మరణాల రేటు 3.33 శాతంగా ఉంది.
ఒకే రోజులో 1,65,412 మందికి పరీక్షలు:
దేశంలో కరోనా పరీక్షలు కూడా ప్రభుత్వం వేగంగా చేస్తుంది. గురువారం(18 జూన్ 2020) దేశవ్యాప్తంగా 1,65,412 మందిని పరీక్షించారు. దేశంలో ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను పరీక్షించడం ఇదే మొదటిసారి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 62,49,668 మందిని పరీక్షించారు. ప్రస్తుతం దేశంలోని 953 ల్యాబ్ల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో 699 ప్రభుత్వ, 254 ప్రైవేట్ ల్యాబ్లు ఉన్నాయి.
మహారాష్ట్రలో అత్యధిక మరణాలు:
ఇక దేశంలో ఎక్కువగా కరోనా కారణంగా ప్రభావితం అయిన రాష్ట్రం మహారాష్ట్ర. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,20,504 కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 60,838 మంది రోగులు కోలుకోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,751 కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 53,301 మంది క్రియాశీల రోగులు ఉన్నారు.
మహారాష్ట్రలో గురువారం 114 మరణాలు సంభవించగా.. దేశంలో కరోనా కారణంగా చనిపోయిన 334మందిలో ఢిల్లీలో 67, తమిళనాడులో 49, గుజరాత్లో 27, ఉత్తరప్రదేశ్లో 18, హర్యానాలో 12, బెంగాల్లో 12, కర్ణాటకలో 8, రాజస్థాన్లో 5, బీహార్లో 3, జమ్మూ కాశ్మీర్లో 2, ఆంధ్రాలో 2 ఉన్నాయి. ఇవే కాకుండా ఛత్తీస్ఘడ్, పుదుచ్చేరి, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఒకరు చొప్పున మరణించారు.
కరోనా పరీక్షలకు మొబైల్ ల్యాబ్:
కరోనా కేసులు ఎక్కువగా నమోద అవుతున్న క్రమంలోనే వీలైనన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా దేశంలో తొలిసారి మొబైల్ ల్యాబొరేటరీని కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ల్యాబ్ను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ప్రారంభించారు. దీని ద్వారా రవాణా సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాల్లో సైతం శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించవచ్చు.