Covid Cases: దేశంలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం.. 5రోజుల్లో లెక్కలు ఇవే!
దేశంలో కరోనా సంక్రమణ కేసులు తగ్గుముఖం పట్టాయి. క్రియాశీల కేసులు చాలా రోజుల తర్వాత తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35 వేల 499 కరోనా కేసులు నమోదయ్యాయి.
Covid Cases: దేశంలో కరోనా సంక్రమణ కేసులు తగ్గుముఖం పట్టాయి. క్రియాశీల కేసులు చాలా రోజుల తర్వాత తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35 వేల 499 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 35వేల 499 మందికి పాజిటివ్ రాగా.. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 19 లక్షల 69 వేల 954కు చేరింది. ఇదే సమయంలో 447 మంది కొవిడ్ కారణంగా చనిపోగా.. మొత్తం మరణాలు 4లక్షల 28వేల 309కి పెరిగాయి. 24గంటల వ్యవధిలో39వేల మంది కోలుకున్నారు. వైరస్ను జయించినవారి సంఖ్య 3.11 కోట్లకు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షల 2వేల 188గా ఉంది.
వరుసగా మూడో రోజు రోజువారీ మరణాల సంఖ్య కూడా ఐదు వందల కంటే తక్కువకు చేరుకుంది. అయితే, కేరళలో పరిస్థితి మెరుగుపడట్లేదు. కొత్త కేసుల్లో సగానికి పైగా కేరళకు చెందినవే. ఇక దేశవ్యాప్తంగా ఇప్పుడు మిక్స్డ్ వ్యాక్సినేషన్పై చర్చ జరుగుతోంది.
ఐసీఎంఆర్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో తొలి డోసు కొవిషీల్డ్, సెకండ్ డోస్ కొవాగ్జిన్ తీసుకున్న వారి వ్యాధి నిరోధకతను పరిశీలించారు. రెండు డోసులూ కొవిషీల్డ్గానీ.. లేదా కొవాగ్జిన్గానీ తీసుకున్న 40మందితో వీరిని పోల్చి చూశారు. రెండు డోసులు వేర్వేరు టీకాలు తీసుకున్న వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్టు ఐసీఎంఆర్ తన అధ్యయనంలో గుర్తించింది.
ఒకే రకమైన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో కంటే వేర్వేరు డోసులు తీసుకున్న వారిలోనే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండటంతో పాటు ఎలాంటి దుష్ఫలితాలు లేనట్టు గుర్తించారు. ఆల్ఫా, బీటా, డెల్టాలాంటి వేరియంట్లను తట్టుకునే శక్తి కూడా మిక్స్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది.
గడిచిన 5రోజుల్లో కరోనా గణాంకాలు:
ఆగస్టు 4 – 42 వేల 982 కేసులు నమోదయ్యాయి
ఆగస్టు 5 – 44 వేల 643 కేసులు నమోదయ్యాయి
ఆగస్టు 6 – 38 వేల 628 కేసులు నమోదయ్యాయి
ఆగస్టు 7 – 39 వేల 70 కేసులు నమోదయ్యాయి
ఆగస్టు 8 – 35 వేల 499 కేసులు నమోదయ్యాయి
ఇప్పటివరకు దేశంలో 50.86 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వబడింది. ఇప్పటివరకు, 50 కోట్ల 86 లక్షల 64 వేల 759 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో మొదటి మోతాదు 39.56కోట్ల మందికి ఇవ్వగా.. ఇది మొత్తం జనాభాలో 29.16%. అదే సమయంలో, 11.29 కోట్ల మంది ప్రజలు సెకండ్ డోసు ఇచ్చారు, అంటే జనాభాలో 8.33 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.