కరోనా తుఫాన్.. దేశంలో కొత్తగా 2లక్షల 59వేల కేసులు
Coronavirus live updates: కరోనా తుఫాన్లో భారత్ అల్లకల్లోలం అవుతోంది. ఒక్కరోజులోనే దేశంలో 2 లక్షల 59 వేల 170 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. నిన్నటితో పోలిస్తే 14 వేల కేసులు తగ్గినట్లు కనిపించినా… మొన్న ఆదివారం వీకెండ్ కావడం, టెస్టింగ్ సెంటర్లు క్లోజ్ చేసి ఉండడంతో టెస్టులు తక్కువ చేశారు. ఆ లెక్కన ఇవాళ నమోదైన కేసులు తక్కువేమి కాదు. వైరస్ ఉధృతి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే రోజుకు 3లక్షలు కేసులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వెయ్యి 761మందికి పైగా కరోనాతో చనిపోయారు. పరిస్థితి చూస్తుంటే ఈ వారంలోనే రోజుకు 2వేలకు పైగా కరోనా మరణాలు నమోదవడం పక్కాగా తెలుస్తోంది.
ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులు జెట్ స్పీడ్తో దూస్తుకెళ్తుంటే.. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. దేశంలో ప్రస్తుతం 20 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ప్రపంచంలో అమెరికా తప్ప మరే దేశంలోనూ ఇన్ని యాక్టివ్ కేసులు లేవు. పది రోజుల ముందు పది లక్షలుగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పడు 20 లక్షలు దాటేసింది. అంటే పది రోజుల్లోనే యాక్టివ్ కేసులు రెట్టింపయ్యాయి.
మార్చి 31 నాటికి 5 లక్షల 80 వేలగా ఉన్న యాక్టివ్ కేసులు 20 రోజుల్లోనే ఏకంగా 15 లక్షలు పెరిగాయి. కరోనాతో విలవిలాడుతున్న బ్రెజిల్లో కూడా ఇండియాలో ఉన్నన్ని యాక్టివ్ కేసులు లేవు. అటు పాజిటివిటీ రేటు భారత్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరిగింది.