ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్.. మొదలుకానున్న ప్రయోగాలు

ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్.. మొదలుకానున్న ప్రయోగాలు

నెలల తరబడి భారత్‌ను పట్టిపీడిస్తున్న భయంకరమైన సమస్య Covid-19. ఈ ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇండియన్ గవర్నమెంట్ మరిన్ని ప్రయత్నాలను వేగవంతం చేసింది. భారత్‌ బయోటెక్, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ ప్రయోగాలు కొనసాగిస్తుండగా తాజాగా రెండు సంస్థలు వేర్వేరుగా రెండు సరికొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి.

శరీరానికి ఈ వ్యాక్సిన్‌లను ముక్కు ద్వారా ఇస్తారు. కొత్త వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్వయంగా ఆదివారం ప్రకటించారు. నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించిన తరువాతే రెండు సంస్థలు ముక్కు ద్వారా అందించే కొవిడ్‌-19 నిరోధక వ్యాక్సిన్ ప్రయోగాలు మొదలు పెడతాయని సండే సంవాద్‌ కార్యక్రమంలో ప్రకటించారు.



హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ కొవిడ్‌–19 నియంత్రణ కోసం నాలుగు రకాల టీకాలను రెడీ చేస్తుంది. ఇందులో ఒకటైన కొవ్యాగ్జిన్‌ ఇప్పటికే రెండు ఫేజ్‌ల హ్యూమన్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది. మిగిలిన 3 వ్యాక్సిన్లలో ఒకటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో సిద్ధమవుతోంది.

ఈ కొత్త వ్యాక్సిన్‌ కోసం వాషింగ్టన్‌ యూనివర్సి టీ, సెయింట్‌ లూయిస్‌ యూనివర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో భాగంగానే భారత్‌ బయోటెక్‌కు ముక్కుద్వారా అందించే టీకా ప్రయోగాలు, తయారీ, పంపిణీలపై హక్కులు లభిస్తాయని డాక్టర్‌ హర్షవర్ధన్‌ తన ప్రసంగంలో తెలిపారు.

ఎలుకలపై జరిపిన ప్రయోగంలో ఈ టీకాకు మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇంజెక్షన్, సిరంజీ వంటివి లేకుండానే టీకాను అందరికీ అందివ్వొచ్చు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఇదే రకమైన టీకా ప్రయోగాలను భారీ ఎత్తున చేపట్టనుందని మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు.
అన్నీ సజావుగా జరిగితే మరికొన్ని నెలల్లోనే కొత్త టీకాల ప్రయోగాలు మొదలుకానున్నట్లు అధికారులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం మూడో దశ ప్రయోగాలు జరుపుకుంటున్న టీకాలన్నీ ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చేవి మాత్రమే కావడం గమనార్హం.

రష్యా డెవలప్ చేసిన స్పుత్నిక్‌–వీ టీకాపై రెండు, మూడో దశ ప్రయోగాలు నిర్వహించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీకి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలే అనుమతులిచ్చింది. వీటి ఆధారంగా చూస్తే భారత్‌లో రానున్న 6 నెలల్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ టీకా ముందుగా వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉన్న వారికి కొవిడ్-19 నిరోధక టీకా అందేందుకు మరికొంత సమయం పడుతుంది.