18 రాష్ట్రాల్లో 771 రకాల కరోనా వైరస్ లు గుర్తింపు..డబుల్ మ్యూటెంట్ రకం కూడా

దేశంలో కొత్త రకం కరోనా వైరస్ ఆనవాళ్లను కనుగొన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఓ కీలక ప్రకటన చేసింది. భారత్ లో 771 రకాల కరోనా వైరస్ లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

18 రాష్ట్రాల్లో 771 రకాల కరోనా వైరస్ లు గుర్తింపు..డబుల్ మ్యూటెంట్ రకం కూడా

Coronavirus Variants

Coronavirus Variants దేశంలో కొత్త రకం కరోనా వైరస్ ఆనవాళ్లను కనుగొన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఓ కీలక ప్రకటన చేసింది. భారత్ లో 771 రకాల కరోనా వైరస్ లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఇప్పటిదాకా ప్రపంచం చూడని కొత్త రకం కరోనా కూడా ఉంది. “డబుల్ మ్యుటెంట్( రెండుసార్లు రూపాంతరం చెందే)” రకం అని దానిని పిలుస్తున్నారు.

తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించిన కరోనా పాజిటివ్ శాంపిళ్లలో 10,787 శాంపిళ్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. 771 కొత్త రకాల కరోనా ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ కరోనా రకాల్లోని 736 శాంపిళ్లలో బ్రిటన్ రకం కరోనా ఉందని నిర్ధారించినట్టు పేర్కొంది. ఇంకో 34 శాంపిళ్లలో దక్షిణాఫ్రికా రకం ఉన్నట్టు తేల్చింది. ఇంకో శాంపిల్ లో బ్రెజిల్ రకం ఉందని పేర్కొంది. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఈ కొత్త రకం కరోనా ఆనవాళ్లున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాటికి అదనంగా డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్టు గుర్తించింది.

కరోనా వైరస్ జన్యు క్రమ నిర్ధారణపై ఏర్పాటు చేసిన భారత సార్స్ కొవ్2 కన్సార్టియం.. కరోనా జన్యు క్రమాలను విశ్లేషించిందని వెల్లడించింది. వేరియంట్లు ఉండడం సర్వసాధారణమని, ప్రతి దేశంలోనూ వాటి ఆనవాళ్లుంటాయని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం జన్యు క్రమ విశ్లేషణ చేసిన శాంపిళ్లన్నీ అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించినవి, దేశంలోని వివిధ కమ్యూనిటీల నుంచి తీసుకున్నవేనని పేర్కొంది.

మహారాష్ట్రలోని శాంపిళ్లను పరిశీలించగా ఈ484క్యూ, ఎల్452ఆర్ జన్యు పరివర్తనలు కలిగిన డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్టు తేలిందన్నారు. గత ఏడాది డిసెంబర్ తో పోలిస్తే ఇప్పుడు అవి ఎక్కువయ్యాయని తెలిపింది. ఇలాంటి మ్యుటెంట్ కరోనాలు రోగ నిరోధక వ్యవస్థకు దొరక్కుండా తప్పించుకుంటాయని వెల్లడించింది. ఈ రెండు మ్యుటేషన్లు దాదాపు 20 శాతం శాంపిళ్లలో ఉన్నాయని చెప్పింది. కేరళలోని 14 జిల్లాల నుంచి 2,032 శాంపిళ్లను పరిశీలించగా ఎన్440కే వేరియంట్ ఉన్నట్టు తేలిందని కేంద్రం తెలిపింది. 11 జిల్లాల్లోని 123 శాంపిళ్లను పరిశీలించగా.. ఈ వేరియంట్ ఇమ్యూన్ సిస్టమ్ ను దాటుకుని మనగలిగిందని వెల్లడించింది. ఇంతకుముందు, తెలంగాణలోని 104 శాంపిళ్లకుగానూ 53 శాంపిళ్లు, ఏపీలో 33 శాతం శాంపిళ్లలో ఈ వేరియంట్ ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్, డెన్మార్క్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా వంటి 16 దేశాల్లోనూ ఈ వేరియంట్ మూలాలున్నాయని చెప్పింది.

అయితే వెల్లువలా వస్తున్న ఈ కరోనా కేసులకు, తాజాగా బయటపడిన రెండుసార్లు రూపాంతరం చెందే కొత్త రకం కరోనా వైరస్ కు ప్రత్యక్ష సంబంధం ఉందా? లేదా? అన్నదానిపై పరిశీలన జరిపేంత స్థాయిలో లభ్యమవలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా, దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నారు. తెలంగాణ సర్కారు కూడా తాజాగా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. ఇదే బాటలో పలు రాష్ట్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, గత అనుభవాల దృష్ట్యా లాక్ డౌన్ విధించే అవకాశాలు లేనప్పటికీ జన సమ్మూహాలను కట్టడి చేసే చర్యలను మాత్రం తీసుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరో వైపు, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచ దేశాలన్నింటినీ వణికించిన కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాక్సినేషన్ ను ప్రపంచ దేశాలకు అందించే విషయంలో భారత్ శాస్త్రవేత్తలు అందరి కంటే ముందున్నారు. భారత్ ప్రభుత్వం కూడా ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరా విషయంలో ఉదారంగా వ్యవహరిస్తుండటంపై ప్రశంసలు వస్తున్నాయి.