ప్రేమికులకు అర్ధరాత్రి పెళ్లి చేసిన గ్రామస్తులు

  • Published By: chvmurthy ,Published On : August 29, 2019 / 11:25 AM IST
ప్రేమికులకు అర్ధరాత్రి పెళ్లి చేసిన గ్రామస్తులు

పాట్నా:  ప్రతిరోజు రాత్రిపూట రహస్యంగా కలుసుకుంటున్న ప్రేమికులకు అర్ధరాత్రి పెళ్లి చేశారు గ్రామస్తులు. పంచాయతీ సభ్యుల ఆదేశాల మేరకు పూజారిని పిలిపించి శాస్త్రోక్తంగా ప్రేమికులను ఒకింటి వారిని చేశారు. ఈ పెళ్లి బీహార్ లో జరిగింది. 

బీహార్ లోని మోతీహరి జిల్లా పరిధిలోని సాహిబ్ గంజ్ గ్రామానికి చెందిన యువకుడు పక్క గ్రామమైన కొనిహ్యా గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు అర్ధరాత్రి పూట గ్రామశివారులోని ఇసుక తిన్నెలలో కలుసుకుంటూ ఉన్నారు. కొన్నాళ్లుగా వీరి వ్యనహారాన్నిగమనించిన కొనిహ్యా  గ్రామస్తులు వారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమలో మంగళవారం అర్ధరాత్రి ఆగస్టు 27, 2019 నాడు కూడా  ప్రేమికులిద్దరు ఇసుక తిన్నెల్లో కలుసుకుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో వందలాది మంది గ్రామస్తులు వారిని చుట్టుముట్టారు. వారిని చూసి భయంతో ఆ యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతమందిని దాటుకుని అతను తప్పించుకు పోలేకపోయాడు.

అర్ధరాత్రి ప్రేమ జంటను గ్రామంలోకి తీసుకు వచ్చారు. పెద్దలను పిలిపించారు. పంచాయతీ పెట్టారు. తమ ఉరు అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని యువకుడిని అడిగారు. అందుకు అతడు ఓకే చెప్పాడు. ఆ యువతిని కూడా గ్రామస్తులు అభిప్రాయం చెప్పమని అడిగారు. ఆమె కూడా పెళ్ళి చేసుకోటానికి అంగీకరించింది. వెంటనే  గ్రామంలోని పూజారిని పిలిపించి వారిద్దరికీ శాస్త్రోక్తంగా పెళ్ళి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామంలోకి వచ్చే సరికి పెద్దలు పెళ్లికి ఏర్పాట్లు చేశారు. వచ్చిన పోలీసులు ప్రేమజంటను ఆశీర్వదించారు.