దంపతుల ఘరానా మోసం : రెట్టింపు డబ్బు ఇస్తామంటూ రూ.100 కోట్లు బురిడీ

  • Published By: veegamteam ,Published On : October 20, 2019 / 05:24 AM IST
దంపతుల ఘరానా మోసం : రెట్టింపు డబ్బు ఇస్తామంటూ రూ.100 కోట్లు బురిడీ

తమిళనాడులో దంపతులు ఘరానా మోసం చేశారు. పెట్టిన పెట్టుబడికి వంద రోజుల్లో రెట్టింపు ఇస్తామంటూ రూ.100 కోట్లకు పైగా బురిడీ కొట్టిన దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సేలం రెడ్డిపట్టి అంబేద్కర్‌నగర్‌కు చెందిన మణివణ్ణన్‌(38), ఇందుమతి(33) దంపతులు తమ బంధువులతో కలిసి సేలం-ఓమలూరు రోడ్డులో ఆర్‌ఎంవీ గ్రూప్‌ సంస్థ ప్రారంభించారు. తమ సంస్థలో డబ్బు డిపాజిట్‌ చేస్తే వంద రోజుల్లో రెట్టింపు, మరింత కాలం డిపాజిట్‌గా ఉంచితే 25 శాతం వడ్డీ చెల్లిస్తామని ఆశ చూపారు.

భారీ సొమ్ముతో మణివణ్ణన్‌ ఫొటోలు దిగి డిపాజిట్‌ దారులకు పంపేవాడు. భారీగా సమకూరిన కోట్లాది రూపాయలతో మణివణ్ణన్‌ దంపతులు గత ఏడాది ప్రారంభంలో దుబాయ్‌కు పారిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందిన దంపతులు రెండు రోజుల క్రితం సేలంకు రాగా పోలీసులు శనివారం (అక్టోబర్ 20, 2019) అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.

దంపతుల నుంచి రెండు లగ్జరీ కార్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, 13 సెల్‌ఫోన్లు, రెండు బంగారు గాజులు, పది సవర్ల బంగారు చైను, రూ.50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌ ఖాతాల వివరాలను సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సేకరిస్తున్నారు.