ఢిల్లీలో అందరికీ కరోనా టెస్టులు… అల్ పార్టీ మీట్ లో షా హామీ

  • Published By: venkaiahnaidu ,Published On : June 15, 2020 / 09:53 AM IST
ఢిల్లీలో అందరికీ కరోనా టెస్టులు… అల్ పార్టీ మీట్ లో షా హామీ

ఢిల్లీలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ  సమయం లో దేశ రాజధానిలో నివసిస్తున్న ప్రజలందరికీ కరోనా వైరస్‌ నిర్దారణ పరీక్షలు నిర్వహించే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ తెలిపారు.

నేషనల్ కాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)పరిధిలో నివసించే ప్రతీ ఒక్కరికీ కోవిడ్-19 టెస్టులు చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు చెప్పారు. మరికొన్ని రోజుల్లో.ఢిల్లీలో ఒక్క  రోజుకు జరిగే కరోనా వైరస్ పరీక్షలు 18,000 కు చేరుకుంటాయని హోంమంత్రి అమిత్ షా  తెలిపారు. అయితే చాలా రాజకీయ పార్టీలు,పార్టీ లైన్స్ కి అతీతంగా ఇంకా ఎక్కువ సంఖ్య లో టెస్ట్ లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు తరువాత  అత్యధిక COVID-19 కేసులు నమోదవుతున్న మూడవ రాష్ట్రంగా  ఢిల్లీ నిలిచింది. ఢిల్లీ లో ఇప్పటి వరకు  41, 182 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 1,327 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అమిత్‌ షా సోమవారం నార్త్‌ బ్లాక్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ఢిల్లీ అధికార పార్టీ ఆమ్‌ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్‌, బహుజన్‌సమాజ్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా..  ప్రజల్లో కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోందని.. రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లందరికీ టెస్టులు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అదే విధంగా కరోనా బాధిత కుటుంబానికి, కంటైన్మెంట్‌ ఏరియాలో నివసిస్తున్న కుటుంబాలకు రూ. 10 వేలు చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అలాగే మెడిసిన్‌ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులను నాన్‌ పర్మినెంట్‌ రెసిడెంట్‌ డాక్టర్లుగా గుర్తించి సేవలు వాడుకోవాలని సూచించింది. 

ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్‌ షా.. కరోనా విజృంభణ నేపథ్యంలో రోజుకు 18 వేల మందికి చొప్పున కరోనా పరీక్షలు చేయించనున్నట్లు వెల్లడించారు.  కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) అనిల్‌ బైజాల్, ‌కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులతో ఆదివారం సమావేశమైన అమిత్‌ షా కరోనాను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. 

మరో వైపు దేశ రాజధానిలో జులై 31 నాటికి 5.5 లక్షల కరోనా  వైరస్ కేసులు వాతాయని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేసినట్లు ఇటీవల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపిన విషయం తెలిసిందే.