కరోనా పరిస్థితి రానున్న రోజుల్లో మరింత దారుణం : కేంద్రం
దేశంలో కొద్ది రోజుల్లోనే కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని.. ఇప్పుడు భారత్ సెకండ్ వేవ్ గుప్పిట్లో ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. దేశంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికి చాలా కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు
Covid Situation దేశంలో కొద్ది రోజుల్లోనే కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని.. ఇప్పుడు భారత్ సెకండ్ వేవ్ గుప్పిట్లో ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. దేశంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికి చాలా కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. వైరస్ ను మనం నియంత్రించగలం అనుకుంటున్నప్పుడల్లా.. వైరస్ ఇప్పటికీ చాలా యాక్టివ్ గా ట్రెండ్స్ చూపిస్తున్నాయని.. ఇది తిరిగి మళ్లీ చెలరేగుతుందని వ్యాక్సిన్ నిర్వహణపై జాతీయ నిపుణుల కమిటీ చైర్మన్ వీకే పాల్ అన్నారు
దేశంలో వైరస్ ఏ మూల ఉన్నా.. దేశమంతటా విస్తరిస్తుందని వీకే పాల్ హెచ్చరించారు. ప్రజలంతా కోవిడ్ 19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. మనల్ని మనం రక్షించుకోవాలంటే లాంగ్ టైం మాస్కులు వాడాల్సిందేనని వీకే పాల్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకోవాలని వీకే పాల్ అన్నారు. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 47 జిల్లాల్లో ఆర్టీ-పీసీఆర్ టెస్ట్లను వేగవంతం చేయాలని వీకే పాల్ అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా 10 జిల్లాల్లో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. అందులో 8 జిల్లాలు మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. వీటిలో 59వేలకు పైగా కేసులతో పుణె మొదటి స్థానంలో ఉండగా.. ముంబై, నాగపూర్, థానే, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, నాందేడ్, ఢిల్లీ, అహ్మద్ నగర్ తర్వాత స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్రలో పాజిటివిటీ రేటు గత వారం 23 శాతానికి దాటిందని వీకే పాల్ తెలిపారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి మహారాష్ట్రలో రోజుకు కనీసం 3వేల కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు.
ఇక, ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరూ టీకా వేసుకునేందుకు అర్హులేనని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ యాప్లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా కాకపోతే వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లేప్పుడు ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ పాస్బుక్ లేదా రేషన్ కార్డు తీసుకువెళ్లాలని తెలిపారు.