Covid Water : నీళ్లలో మృతదేహాలు.. కరోనా వైరస్‌ సంక్రమిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారు?

నదుల్లో మృతదేహాలు లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అవి కొవిడ్‌ సోకి చనిపోయిన వారి మృతదేహాలన్న అనుమానం నదీ పరివాహక ప్రాంత ప్రజల్లో మరింత భయానికి కారణమైంది. నీటిలో మృతదేహాలు కొత్త అనుమానాలకు దారితీశాయి. నీటిలో మృతదేహాలతో వైరస్ సంక్రమిస్తుందేమోననే భయం పట్టుకుంది. దీనిపై నిపుణులు స్పందించారు.

Covid Water : నీళ్లలో మృతదేహాలు.. కరోనా వైరస్‌ సంక్రమిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారు?

Covid Transmission Through Water Is Not A Concern

Covid Water Transmission : ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. ఈ మహమ్మారి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటు వైపు నుంచి దాడి చేస్తోందో తెలియక విలవిలలాడిపోతున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో కరోనా పేరు వింటే చాలు హడలిపోతున్నారు.

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. నదుల్లో మృతదేహాలు లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అవి కొవిడ్‌ సోకి చనిపోయిన వారి మృతదేహాలన్న అనుమానం నదీ పరివాహక ప్రాంత ప్రజల్లో మరింత భయానికి కారణమైంది. నీటిలో మృతదేహాలు కొత్త అనుమానాలకు దారితీశాయి. నీటిలో మృతదేహాలతో వైరస్ సంక్రమిస్తుందేమోననే భయం పట్టుకుంది. నదులు కరోనా వైరస్ ను వ్యాప్తి చేయగలవా? అనే ప్రశ్న తలెత్తింది. దీనిపై నిపుణులు స్పందించారు. నీటిలో మృతదేహాలు లభ్యం కావడం తీవ్రమైన విషయమే అయినప్పటికీ నీటి ద్వారా కరోనా వైరస్‌ సంక్రమణపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

నదిలో మృతదేహాలు ప్రవహించే సమయంలో నీటిలో కరోనా వైరస్‌ బలహీన పడడం వల్ల సంక్రమణ చెందే ప్రభావం అంతగా ఉండదని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్‌ సతీష్‌ తారే అభిప్రాయపడ్డారు. ప్రవాహ సమయంలో నీరు శుద్ధికావడం సాధారణ ప్రక్రియలో భాగమని చెప్పారు. అక్కడ కొందరు ప్రజలు తాగునీటి కోసం నేరుగా నది నుంచే తీసుకునే సందర్భాలు ఉన్నాయని.. అలాంటి సందర్భాల్లో కొంత జాగ్రత్త పాటించాలన్నారు. కరోనా వైరస్‌తో దేశం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో గంగా, వాటి ఉపనదుల్లో మృతదేహాలు వేయడం తీవ్రమైన విషయమని అన్నారు. అయినప్పటికీ నీటి ద్వారా వైరస్‌ సంక్రమణపై ఇవి గణనీయమైన ప్రభావాన్ని చూపవని వెల్లడించారు. గంగా, యమునా నదుల్లో మృతదేహాలను వేయడం కొత్తేమీ కాదని.. కానీ, గత దశాబ్ద కాలం నుంచి వీటి సంఖ్య తగ్గిందన్నారు. ఇవి నదుల కాలుష్యానికి కారణమవుతున్నాయని చెప్పారు.

నీటి ద్వారా వైరస్‌ సంక్రమణపై ఆందోళన అక్కర్లేదని నీతి ఆయోగ్‌ సభ్యులు (ఆరోగ్యం) వీకే పాల్‌ ఈ మధ్యే వెల్లడించారు. ఇలాంటి మాధ్యమాల ద్వారా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు విజయ రాఘవన్‌ స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తులు అతి దగ్గరగా ఉండి మాట్లాడుకునే సందర్భంలో, లేదా అలా మాట్లాడినప్పుడు సూక్ష్మబిందువులు పడిన ప్రదేశాన్ని మరో వ్యక్తి తాకడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా నీటిలో డైల్యూషన్‌ కారణంగా సూక్ష్మజీవులు పలుచన పడిపోవడం వల్ల వైరస్‌ సంక్రమణ ప్రమాదం తక్కువేనని వివరించారు.

బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో గంగానదిలో దాదాపు 71 మృతదేహాలు కొట్టుకువచ్చిన విషయం తెలిసిందే. అవి కొవిడ్‌ సోకి మరణించిన వారి మృతదేహాలనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో నదీ పరివాహక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నీటిలో వైరస్‌ వ్యాప్తి ప్రమాదం తక్కువేనని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.