ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు ప్రక్రియ ఏకపక్షంగా ఉంది : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు ప్రక్రియ ఏకపక్షంగా ఉంది : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Sc Unhappy Army Process Created By Males, For Males (1)

sc  army process “Created By Males, For Males” : మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేసే ఆర్మీ ప్రక్రియపై దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు మేరకు రక్షణ శాఖ మహిళలకు ఆర్మీలో శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమిషన్ ఏర్పాటు చేసే విషయంలో ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ పొందడానికి నిర్దేశించిన మెడికల్‌ ఫిట్‌నెస్‌ పద్దతి అనేది ఏకపక్షంగా.. అహేతుకంగా ఉందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదే విషయాన్ని వెల్లడించింది. సైన్యంలో శాశ్వత కమిషన్ కోసం సుమారు 80 మంది మహిళా అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం (మార్చి 25,2021) అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

“మన సమాజ నిర్మాణం మగవారి కోసం.. మగవారిచే సృష్టించబడిందని మేము ఇక్కడ గుర్తించాలి” అంటూ వ్యాఖ్యానించింది. సైన్యం సెలెక్టివ్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఎస్‌సీఏఆర్) మూల్యాంకనం, మెడికల్ ఫిట్‌నెస్ క్రైటిరియాను ఆలస్యంగా అమలు చేయడం అనేది మహిళా అధికారులపై వివక్ష చూపుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. “ఎస్ఎస్‌సీ (షార్ట్ సర్వీస్ కమిషన్) మూల్యాంకనం విధానం మహిళా అధికారులకు ఆర్థిక, మానసిక హాని కలిగిస్తుంది’ అంటూ జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన ఏర్పాటైన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. “కోర్టు ముందుకు వచ్చిన అనేక మంది మహిళా అధికారులు ఎంతో ప్రతిభ చూపి అనేక అవార్డులు గెలుచుకున్నారు. చాలామంది విదేశీ కార్యకలపాల అంశంలో చక్కగా పనిచేశారు” అని తెలిపారు. ‘‘క్రీడా పోటీలలో రాణించిన వారిని విస్మరించినట్లు మేం గుర్తించామని అన్నారు. మహిళలు సాధించిన విజయాల వివరణాత్మక లిస్టు తీర్పులో ఇవ్వబడింది … దీన్ని బట్టి చూస్తే ఈబోర్డు ఎంపిక కోసం కాకుండా తిరస్కరణ కోసం పని చేసినట్లు కనిపిస్తోంది’’ అని చంద్రచూడ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఇటువంటి వివక్ష చూపించటం తగదని చురకలు వేసింది.

భారత మిలిటరీకి సంబంధించి గతేడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు శాశ్వత కమిషన్‌ని ఏర్పాటు చేసి సైన్యంలోని మహిళా అధికారులకు పురుష అధికారులతో సమానంగా కమాండ్ స్థానాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మహిళల సర్వీసుతో సంబంధం లేకుండా శాశ్వత కమిషన్ అందరికీ అందుబాటులో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం చేసిన వాదనలు “వివక్షత”, “కలతపెట్టేవి”గా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.

ఇప్పటికే భారత వైమానిక దళం, భారత నావికాదళం మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ని మంజూరు చేసింది. దీని ప్రకారం ఐఏఎఫ్‌ మహిళలను ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీలలో అధికారులుగా అనుమతిస్తుంది. మహిళా ఐఏఎఫ్‌ షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులు ప్రస్తుతం హెలికాప్టర్, రవాణా విమానం, ఫైటర్ జెట్లను కూడా నడుపుతున్నారు. నావికాదళంలో లాజిస్టిక్స్, లా, అబ్జర్వర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, మారిటైమ్ నిఘా పైలట్లు, నావల్ ఆర్మేమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్లలో ఎస్‌ఎస్‌సీ ద్వారా చేరిన మహిళా అధికారులను నావికా దళం అనుమతిస్తుంది.