Aryan : ఎన్సీబీ కస్టడీకి షారుక్ ఖాన్ కొడుకు
ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతోందని తెలుసుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు(ఎన్ సీబీ-మాదకద్రవ్యాల నిరోధక శాఖ) ఆ నౌకపై రెయిడ్ చేసిన సంగతి తెలిసిందే.
Aryan : ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతోందని తెలుసుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు(ఎన్ సీబీ-మాదకద్రవ్యాల నిరోధక శాఖ) ఆ నౌకపై రెయిడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెయిడ్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ సహా మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ముంబైలోని జేజే మెడికల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిలో ముగ్గురుని మాత్రం తమ కస్టడీలోకి తీసుకున్నారు.
వీరిలో షారుక్ కొడుకు ఆర్యన్ కూడా ఉండటం గమనార్హం. ఆర్యన్తో పాటు అర్బాజ్ సేత్ మర్చంట్, మున్మున్ దమేచాను అధికారులు రిమాండ్కు తరలించారు. వీరు ముగ్గురూ సోమవారం వరకూ ఎన్సీబీ కస్టడీలో ఉంటారు. అయితే వీరిని రెండ్రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్సీబీ కోరినట్లు తెలుస్తోంది.
ఎన్సీబీ విచారణకు ఆర్యన్ హాజరైన సమయంలో ఒక వ్యక్తి అతనితో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఆ వ్యక్తి కూడా ఎన్సీబీ అధికారే అని అందరూ అనుకున్నారు. అయితే అతనికి ఎన్సీబీకి ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ‘‘అతను ఎన్సీబీ అధికారి కాదు. అలాగే ఆఫీసులో పనిచేసే వ్యక్తి కూడా కాదు’’ అని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, రేవ్ పార్టీ గురించి 15 రోజుల క్రితమే అధికారులకు ఉప్పందినట్లు తెలుస్తోంది. అయితే దీనిలో ఇలా సెలెబ్రిటీల పిల్లలు ఉంటారని వారు ఊహించలేదని సమాచారం. ఈ క్రమంలో షారుఖ్ తనయుడు సహా పలువురు ప్రముఖుల పిల్లలు ఈ పార్టీలో దొరికిపోవడం సంచలనంగా మారింది.
విచారణ సందర్భంగా ఎన్సీబీ అధికారులు ఆర్యన్ వాట్సాప్ చాట్ను చెక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీటి ప్రకారం, ఆర్యన్ తరచూ డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చేవాడని తెలుస్తోంది. కుమారుడు అరెస్ట్ పై షారుఖ్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.