DICGC Act : బ్యాంకు డిపాజిటర్లకు కేంద్రం శుభవార్త..దివాళా తీసినా 90 రోజుల్లోగా రూ.5లక్షలు

బ్యాంకు డిపాజిటర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆర్థిక అవకతవకలు సహా ఇతర కారణాలతో ఆర్బీఐ మారటోరియం ఎదుర్కొంటున్న బ్యాంకుల్లోని డిపాజిట్‌ దారుల సొమ్ముకు భద్రత కల్పించేలా బుధవారం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

DICGC Act : బ్యాంకు డిపాజిటర్లకు కేంద్రం శుభవార్త..దివాళా తీసినా 90 రోజుల్లోగా రూ.5లక్షలు

Fm

DICGC Act బ్యాంకు డిపాజిటర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆర్థిక అవకతవకలు సహా ఇతర కారణాలతో ఆర్బీఐ మారటోరియం ఎదుర్కొంటున్న బ్యాంకుల్లోని డిపాజిట్‌ దారుల సొమ్ముకు భద్రత కల్పించేలా బుధవారం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటి బ్యాంకుల్లోని డిపాజిట్‌దారులు.. 90 రోజుల్లో గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు తమ డబ్బును వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పించే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(DICGC)చట్టం-1961 సవరణ బిల్లుకి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.

ఈ పథకం ద్వారా 98.3 శాతం డిపాజిటర్లు లబ్ధి పొందుతారని కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. బ్యాంకు డిపాజిటర్ల కష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మారటోరియం ఆంక్షల క్రింద ఉన్న బ్యాంకులకు నగదు అందుబాటులోకి వచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆ బ్యాంకులను లిక్విడేట్ చేసే వరకు డిపాజిటర్లు వేచి చూడవలసిన అవసరం ఈ సవరణ వల్ల తప్పుతుందని తెలిపారు.

అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాలు, బహుపాక్షిక ఏజెన్సీలు, ఇంటర్నేషనల్​ ఆర్గనైజేషన్​ ఆఫ్​ సెక్యూరిటీ కమిషన్స్​, ఇంటర్నేషనల్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇన్సూరెన్స్​ సూపర్​వైజర్స్​తో బహుపాక్షిక అవగాహన ఒప్పందం(MoU) కుదిరినట్లు తెలిపారు. చట్టాలకు అనుగుణంగా నడుచుకునే ఎల్​ఎల్​పీ సంస్థల్లోని వారికి సులభతర వాణిజ్య ప్రయోజనాలను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిబంధనల ఉల్లంఘనలను బట్టే జరిమానాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇది ఆత్మనిర్భర్​ భారత్​ను ప్రోత్సహిస్తుందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

కాగా, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్, యస్ బ్యాంక్, లక్ష్మి విలాస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇటీవల సమస్యల్లో చిక్కుకోవడంతో, డిపాజిటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడం కోసం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ చట్టానికి సవరణ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. ఈ సవరణ బిల్లును ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉందని తెలిపారు.

డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది పూర్తిగా ఆర్బీఐ అనుబంధ సంస్థ. డిపాజిటర్లకు సొమ్మును బ్యాంకులు చెల్లించలేకపోతే, వారికి ఈ సంస్థ బీమాను అందజేస్తుంది. బ్యాంకు మారటోరియం క్రిందకు వచ్చిన 90 రోజుల్లోగా డిపాజిటర్లకు ఈ బీమా లభిస్తుంది. దేశంలోని వాణిజ్య, విదేశీ బ్యాంకులు, సెంట్రల్, స్టేట్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, లోకల్ బ్యాంకుల డిపాజిటర్ల సొమ్ముకు ఈ సంస్థ రక్షణ కల్పిస్తుంది. అయితే ఆయా బ్యాంకులు ఈ సంస్థ పరిధిలోకి వచ్చే అవకాశాన్ని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. సేవింగ్స్, కరెంట్, రికరింగ్, ఫిక్స్‌డ్ వంటి అన్ని రకాల డిపాజిట్ హోల్డర్లకు ఈ బీమా సదుపాయం వర్తిస్తుంది. అన్ని రకాల బ్యాంకు డిపాజిట్ అకౌంట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ బీమా చేస్తుంది. ఒక బ్యాంకులో ఒక ఖాతాదారుకు రూ.5 లక్షల వరకు ఇటువంటి డిపాజిట్లు ఉంటే, వాటిపై ఈ బీమా సదుపాయం లభిస్తుంది.