అలీబాగ్ వద్ద తీరాన్ని తాకిన నిసర్గ తుపాన్

  • Published By: murthy ,Published On : June 3, 2020 / 08:49 AM IST
అలీబాగ్ వద్ద తీరాన్ని తాకిన నిసర్గ తుపాన్

నిస‌ర్గ తుఫాన్‌ అలీబాగ్ వద్ద తీరాన్ని తాకింది. దీని ప్రభావం వల్ల  మ‌హారాష్ట్ర‌లోని అలీబాగ్ వ‌ద్ద కుండపోతగా వ‌ర్షం కురుస్తోంది.దక్షిణ గుజరాత్ తీరం వైపు దూసుకువెళ్తున్ననిసర్గ  మ‌రో మూడు గంట‌ల్లో తీరం దాట‌నున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన్న‌ది. ముంబై స‌మీపంలో ఉన్న అలీబాగ్ వ‌ద్ద సుమారు 120 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

ఇంటి పైకప్పులు ఎగిరి పడుతున్నాయి. చెట్లు స్తంభాలు నేల కొరుగుతున్నాయి. సముద్ర తీరంలో ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతున్నాయి.  తుఫాన్ నేప‌థ్యంలో ముంబైలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. దాదాపు వందేళ్ల త‌ర్వాత ముంబై తీరాన్ని తుఫాన్ తాక‌నున్న‌ది. రాయ్ ఘడ్ లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.  తుపాను తీరం దాటాక ఏకధాటిగా ఆరుగంటలపాటు వాన కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

 

మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాలపై నిసర్గ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది.  జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్‌ఎఫ్‌) తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో 40 వేల మందిని, గుజరాత్‌లో 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

ముంబైలో బీచ్ లతో పాటు ఇతర ప్రాంతాలలోనూ ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. సాయంత్రం వరకు ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. ముంబై విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు.ఇప్పటికే కురుస్తున్నవర్షాలతో పూణేలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

రాయ్ ఘడ్, రత్నగిరి, పాలఘర్ ,థానే జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.  ముంబై పరిసర ప్రాంతాల్లో 20 ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను మోహరించారు. గుజరాత్‌లో 15 ఎన్డీఆర్‌ఎఫ్‌, 6 ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలను మోహరించారు. దక్షిణ గుజరాత్‌లోని పరిశ్రమలను ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు. గుజరాత్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నవసార్ జిల్లాలో 7 గ్రామాల ప్రజలనుసురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

Read: తీరం తాకిన నిసర్గ తుఫాన్, ముంబైని ముంచెత్తిన వర్షాలు