నివార్ తుపాన్ అప్ డేట్ : చెన్నైలో భారీ వర్షాలు, నేలకూలిన చెట్లు..నీటమునిగిన ఇళ్లు

  • Published By: madhu ,Published On : November 26, 2020 / 06:23 AM IST
నివార్ తుపాన్ అప్ డేట్ : చెన్నైలో భారీ వర్షాలు, నేలకూలిన చెట్లు..నీటమునిగిన ఇళ్లు

Cyclone Nivar live updates : నివార్‌ తుఫాన్‌ తీరం దాటింది. 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరందాటినట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. పుదుచ్చేరిలోని కరైకల్‌ – చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని మామళ్లాపురం మధ్య తుపాను తీరం దాటింది. రాత్రి 11.30 నుంచి తెల్లవారుజాము 2.30 మధ్య నివార్‌ తుపాను తీరం దాటినట్టు ఐఎండీ వెల్లడించింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపాను నుంచి తుపాన్‌గా నివార్‌ మారింది. నివార్‌ తుపాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచాయి. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.



తీరం దాటడానికి ముందు నివార్‌ తుపాను మహోగ్రరూపం దాల్చింది. అర్ధరాత్రి 11 గంటలకు పుదుచ్చేరిలోని కరైకల్‌ – తమిళనాడులోని మహాబలిపురం మధ్య తీరం వైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోనే కాదు..ఏపీలోని నెల్లూరు జిల్లా తీరప్రాంతం కూడా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తమిళనాడు, పుదుచ్చేరిలో 3 నుంచి 5 కిలోమీటర్ల మేర అలలు ఎగసిపడ్డాయి. తీరంలో 20 నుంచి 50 మీటర్ల ముందుకు అలలు దూసుకొచ్చాయి.



మరోవైపు నివారు తుపాను ప్రభావంతో… చెన్నైతో సహా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని చెన్నై, కాంచీపురం సహా… అనేక జిల్లాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. వర్షాలకు లోతట్టుప్రాంతాలు జలమయమవుతున్నాయి. చెన్నైలోని దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి నివాసం ఆవరణలోకి వరద నీరు చేరింది. వేలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక మెరీనా బీచ్‌ వరకు సముద్రనీరు దూసుకొచ్చింది. ఉద్ధృతమైన గాలులతో వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో ఇప్పటికే 16 సెంటీమీటర్లు, పుదుచ్చేరిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్న చెన్నై సహా 13 జిల్లాలలో తమిళనాడు ప్రభుత్వం గురువారం కూడా సెలవు ప్రకటించింది. లక్ష మందికిపైగా ప్రజలను తుపాను షెల్టర్లకు తరలించింది. చెన్నై నుంచి వెళ్లే 26 విమానాలు, కోయంబత్తూరు, బెంగళూరు వెళ్లే పలురైళ్లు రద్దయ్యాయి.



చెన్నైలో చెంబరంబాక్కం సహా పలు జలాశయాలు నిండిపోయాయి. అదనపు నీటిని అడయార్‌ నదిలోకి విడుదల చేశారు. పుదుచ్చేరిలోకూడా వర్షాలు జోరుగా పడుతున్నాయి. 144 సెక్షన్‌ విధించడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. నివార్‌ తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారిమళ్లించారు. దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేసింది. ఈదురుగాలల ఉధృతికి పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. పూనమళ్లై హైవే పూర్తిగా జలదిగ్బంధమైంది.



https://10tv.in/nivar-cylone-prakashraj-foundation-helps-to-people/
భారీ వర్షాలతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు.. గురువారం ఉదయం 7 గంటల వరకు ఎయిర్‌పోర్ట్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 26 విమానాలను రద్దు చేశారు. మెట్రో రైళ్లను కూడా 7 గంటలకు మూసివేశారు.. వాతావరణ పరిస్థితిని బట్టి తిరిగి ప్రారంభించేది.. లేనిది నిర్ణయం తీసుకోనున్నారు.. కేవలం విమానాశ్రాయాలు.. రైళ్లను మాత్రమే కాదు.. సిటీలోని రోడ్లను కూడా మూసివేస్తున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.. దక్షిణ మధ్య రైల్వే కూడా చెన్నై మీదుగా వెళ్లే పలు రైళ్లను దారి మళ్లించగా.. 8 రైళ్లను రద్దు చేసింది.