Agnipath : త్రివిధ దళాధిపతులతో సమావేశం అయిన రాజ్నాధ్సింగ్
ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొన్నిరాష్ట్రాల్లో ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
Agnipath : ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొన్నిరాష్ట్రాల్లో ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. యువత, ఆర్మీ ఉద్యోగార్థులు రైల్వే స్టేషన్లే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. ఈ కొత్త పథకంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
ఇప్పటికే కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆందోళనలు తగ్గకపోవడంతో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు మరోసారి ఈ పధకంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో త్రివిధ దళాధిపతులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అగ్నిపథ్ విధివిధానాలపై మరోసారి చర్చిస్తున్నారు. శనివారం కూడా మంత్రి రాజ్నాథ్ అగ్నిపథ్పై అత్యున్నత సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
కాగా, ఈరోజు రాజ్నాధ్సింగ్తో సమావేశం అనంతరం సైనిక విభాగాల అధిపతులు సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో బీహార్ రావణకాష్టంగా మారింది. రాష్ట్రంలో గత 4 రోజులుగా జరుగుతున్న నిరసన కార్యాక్రమాల్లో ఏకంగా 60 రైల్ కోచ్లు, 11 ఇంజన్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బీహార్లోనే భారతీయ రైల్వేకు రూ.700 కోట్లకు పైగా భారీ నష్టం సంభవించినట్లు అంచనా.
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లలో మూడు బోగీలు కాలిపోయాయి. అగ్నివీర్ లకు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిన్న ప్రకటన విడుదల చేసింది. కాగా.. ఈపధకం ఇప్పుడు కొత్తగా తీసుకు వచ్చింది కాదని…. చాలాకాలంగా పెండింగ్ లో ఉందని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కోంది. అగ్నివీరుల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రకటనలు కూడా ఇప్పటికే రూపోందించబడి ఉన్నాయని…. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లనూ చూసి విడుదల చేయలేదని మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి చెప్పారు.
Also Read : SpiceJet Flight: విమానం రెక్కలకు మంటలు.. 185 ప్రయాణికుల ఎమర్జెన్సీ ల్యాండింగ్