Delhi: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ విజయం.. ‘ఆప్’ తరఫున గెలిచిన బాబీ కిన్నార్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారిగా ఒక ట్రాన్స్జెండర్ ఎన్నికైంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బాబీ కిన్నార్ విజయం సాధించింది.
Delhi: ఒకప్పుడు అనేక రకాలుగా వివక్షకు గురైన ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. డాక్టర్లుగా, సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా కొనసాగుతున్నారు. రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) పరిధిలో ఒక ట్రాన్స్జెండర్ విజయం సాధించింది.
సుల్తాన్పురి మజ్రా అసెంబ్లీ పరిధిలోని సుల్తాన్పురి వార్డు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బాబీ కిన్నార్ అనే ట్రాన్స్జెండర్ ఎన్నికైంది. ఎంసీడీ పరిధిలో ఈ ఘనత సాధించిన తొలి ట్రాన్స్జెండర్గా నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి వరుణ్ ధాకాపై బాబీ 6,714 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఈ ప్రాంత ప్రజలకు బాబీ సుపరిచితం. 2017లో ఎంసీడీకి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ విజయం దక్కలేదు. అన్నా హజారే చేపట్టిన ఉద్యమం నుంచి రాజకీయాల్లో, అనేక కార్యక్రమాల్లో బాబీ యాక్టివ్గా ఉంటూ వస్తోంది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా పని చేసింది. తాజా ఎన్నికల్లో గెలిచిన అనంతరం బాబీ మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేస్తానని చెప్పింది.
చిన్నప్పుడు తాను ఎంతో వివక్షను ఎదుర్కొన్నట్లు, తర్వాత ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చేరి, వెడ్డింగ్ డ్యాన్సర్గా మారినట్లు చెప్పింది. బాబీ గత పదిహేనేళ్లుగా ‘హిందూ యువ సమాజ్ ఏక్తా అవామ్ యాంటీ-టెర్రరిజం కమిటీ’కి ఢిల్లీ అధ్యక్షురాలిగా కూడా కొనసాగుతోంది. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.