Night Curfew : ఒమిక్రాన్ టెన్షన్..ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ

దేశవ్యాప్తంగా,అదేవిధంగా దేశ రాజధానిలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది.

Night Curfew : ఒమిక్రాన్ టెన్షన్..ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ

Delhi

Night Curfew : కరోనా వైరస్..క్రమంగా కనుమరుగైపోతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” రూపంలో మళ్లీ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. వదల బొమ్మాళీ నిన్ను వదలా అంటూ ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు ఈ కొత్త వేరియంట్ గురించి ఎవరి దగ్గరా పూర్తి సమాచారం లేదు. అయినప్పటికీ దీనిని కట్టడి చేసేందుకు సాధ్యమైన ప్రయత్నాలన్నింటీని చేస్తున్నాయి ఆయా దేశాలు. దాదాపు 100 దేశాల్లో ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

అయితే అటు కోవిడ్,ఇటు ఒమిక్రాన్ ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించేందుకు అన్ని శక్తులను ఒడ్డుతోంది భారత్. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా నిలువరించే దిశగా భారత్ అన్ని చర్యలు చేపడుతోంది. ఇక,ఇప్పటికే ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,గుజరాత్,కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తుండగా తాజాగా ఈ జాబితాలో ఢిల్లీ కూడా చేరింది.

కొద్ది రోజులుగా దేశ రాజధానిలో ఓ వైపు కరోనా కేసులు,మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది. ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆదివారం ఆప్ సర్కార్ ప్రకటించింది.

సోమవారం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇక,ఢిల్లీలో ఇవాళ కొత్తగా 290 కోవిడ్ కేసులు నమోదుకాగా,ఒక మరణం నమోదైంది. అయితే ఢిల్లీలో శనివారం నమోదైన కోవిడ్ కేసులతో పోల్చితే.. 16శాతం ఎక్కువ కేసులు ఇవాళ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ALSO READ Margani Bharat : 70శాతం ఆదాయం ఏపీ నుంచే..సినీ పరిశ్రమ రాష్ట్రానికి రావాలి-మార్గాని భరత్