హోం ఐసొలేషన్ లో ఉన్నవారికీ ఆక్సిజన్ పంపిణీ
కరోనా సోకి హోం ఐసొలేషన్ లో ఉన్న ఢిల్లీ వాసులు ఇకపై ఆక్సిజన్ అందుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Delhi Patients కరోనా సోకి హోం ఐసొలేషన్ లో ఉన్న ఢిల్లీ వాసులు ఇకపై ఆక్సిజన్ అందుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హోం ఐసొలేషన్లో ఉన్న కరోనా రోగులకు ఆన్లైన్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేస్తామని కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది.
ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అంబులెన్సులు, నర్సింగ్ హోమ్స్, కొవిడ్ ఇతర ఆస్పత్రులకు కూడా పంపిణీ చేస్తామని గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం లబ్ధిదారులు ఢిల్లీ అధికారిక వెబ్సైట్లో ఫొటో ఐడీ, ఆధార్ కార్డు వివరాలు, కరోనా పాజిటివ్ రిపోర్ట్ సహా సంబంధిత వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా బాధ్యత జిల్లా మెజిస్ట్రేట్లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. సరిపడా సిబ్బందితో దరఖాస్తులను త్వరగా పరిశీలించి సిలిండర్లను అందించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపింది. డీలర్ల దగ్గరున్న నిల్వల ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్.. తేదీ, సమయం, పంపిణీ కేంద్రం చిరునామా మొదలైన వివరాలతో దరఖాస్తుదారులకు ఈ-పాస్లను మంజూరు చేస్తారని ప్రకటనలో తెలిపింది.
ఇక,ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న ఢిల్లీ..బుధవారం మొదటిసారిగా 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కేటాయించినందుకు ధన్యవాదాలు చెబుతూ ప్రధానికి సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. రోజువారీ పద్దతిలో ఢీల్లీకి ఇదే స్థాయిలో ఆక్సిజన్ అందేలా చూడాలని కేజ్రీవాల్ ప్రధానికి విజ్ణప్తి చేశారు.