Wrestlers Protest: జంతర్ మంతర్ వద్ద అర్థరాత్రి పోలీసులకు, రెజ్లర్లకు మధ్య వాగ్వాదం.. అమిత్ షాకు బజరంగ్ పునియా లేఖ
బుధవారం అర్థరాత్రి సమయంలో జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులకు, రెజ్లర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసులు కొందరు మద్యం మత్తులో మహిళా రెజ్లర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఇద్దరి తలకు గాయాలయ్యాయని రెజ్లర్లు ఆరోపించారు.
Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్ల పట్ల లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొంతమంది రెజ్లర్లు నిరసన తెలుపుతున్న విషయం విధితమే. అయితే, బుధవారం రాత్రి 11గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులకు, రెజ్లర్లకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు తమపై దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. పోలీసుల దాడిలో ఇద్దరు క్రీడాకారుల తలకు బలమైన గాయాలయ్యాయని, మహిళా రెజ్లర్ల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు.
మహిళా క్రీడాకారిణి గీతా ఫోగట్ వివాదంపై ట్వీట్ చేశారు. రెజర్లపై పోలీసులు చేసిన దాడిలో నా తమ్ముడు దుష్యంత్ ఫోగట్ తలకు గాయమైందని, మరో రెజ్లర్ కూడా గాయపడ్డాడని చెప్పారు. ఇది చాలా సిగ్గుచేటు అన్నారు. రెజ్లర్లు, పోలీసుల ఘర్షణపై కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా మాట్లాడుతూ.. తాను ఆటగాళ్లను కలిసేందుకు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నాను. నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ కు తనను తీసుకొచ్చారని ఎంపీ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ఢిల్లీ పోలీసులు ఏమన్నారంటే..
ఆప్ నేత, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి రెజ్లర్ల కోసం నిరసనకారుల స్థలంలో మడత మంచాలను తీసుకురావడంతో గొడవకు దారితీసినట్లు తెలుస్తోంది. నిరసన ప్రదేశాల్లోకి పరుపులను తీసుకురావడాన్ని పోలీసులు నిరాకరించారు. ఈ విషయంపై న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రణవ్ తాయల్ మాట్లాడుతూ.. సోమనాథ్ భారతి అనుమతి లేకుండా నిరసన ప్రదేశానికి మడత మంచాలతో వచ్చారు. మడత మంచాల గురించి ఆయన్ను పోలీసులు ప్రశ్నించడంతో అతని మద్దతుదారులు దూకుడుగా ప్రవర్తించారని, ట్రక్కు నుండి మడత మంచాలను దించేందుకు ప్రయత్నించారని అన్నారు. ఆ తరువాత చిన్న వాగ్వాదం చోటు చేసుకుందని, తరువాత భారతితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోవటం జరిగిందని తెలిపారు.
హోమంత్రి అమిత్ షాకు బజరంగ్ పునియా లేఖ ..
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లకు, పోలీసులకు మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో రెజ్లింగ్ క్రీడాకారుడు బజరంగ్ పునియా హోమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై ఢిల్లీ పోలీసులు దాడిచేశారని లేఖలో పేర్కొన్నారు. మే3న 11గంటల సమయంలో మేం రాత్రి విశ్రాంతికోసం ఏర్పాట్లు చేస్తుండగా, ఢిల్లీపోలీసు ఏసీపీ ధర్మేంద్ర 100 మంది పోలీసులతో వచ్చి మాపై దాడి చేశారు. ఈ దాడిలో దుష్యంత ఫ్రోగట్, రాహుల్ యాదవ్ తలలకు గాయాలయ్యాయని అన్నారు. అంతేకాక, ఒలింపియన్ వినేష్ ఫోగట్ పట్ల దుర్భాషలాడారు. సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్ పట్ల దురుసుగా ప్రవర్తించారని అమిత్ షాకు రాసిన లేఖలో బజరంగ్ పునియా పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న క్రీడాకారుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు.