రైతుల ట్రాక్టర్ పరేడ్‌కు అనుమతి నిరాకరణ..నిర్వహించి తీరుతామంటున్న అన్నదాతలు

రైతుల ట్రాక్టర్ పరేడ్‌కు అనుమతి నిరాకరణ..నిర్వహించి తీరుతామంటున్న అన్నదాతలు

Delhi police deny permission for farmers’ tractor parade : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజు రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. భద్రతా కారణాల రీత్యా ఢిల్లీ ఔటర్ రింగ్‌ రోడ్డుపై ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణకు పోలీసులు అంగీకరించలేదు. ట్రాక్టర్ ర్యాలీపై చర్చించేందుకు ఇవాళ పోలీసులు, రైతులు మూడోవిడత సమావేశమయ్యారు. రైతులతో ర్యాలీపై చర్చించిన పోలీసులు రిపబ్లిక్ డే భద్రతను దృష్టిలో ఉంచుకుని అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.

అయితే పోలీసులు అనుమతించకపోయినప్పటికీ ట్రాక్టర్ పరేడ్ నిర్వహించి తీరుతామని రైతులు స్పష్టం చేశారు. ర్యాలీ శాంతియుతంగా జరుగుతుందని, సెంట్రల్ ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆటంకం కలగబోదని రైతులు పోలీసులకు వివరించారు. రేపు కేంద్రంతో 11వ విడత చర్చల అనంతరం ఢిల్లీ పోలీసులతో మరోసారి రైతులు సమావేశం కానున్నారు.

రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ల పరేడ్‌కు అనుమతి నిరాకరించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఆ అంశం తమ పరిధిలోనిది కాదని, అనుమతి ఇవ్వాలా..లేదా అన్నది ఢిల్లీ పోలీసులు తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సమావేశంలో ప్రభుత్వం తమ వాదనపై వెనక్కి తగ్గడం లేదని రైతు నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు. జనవరి 26న ఏమైనా చేసుకోండి కానీ…ఢిల్లీ నగరంలో మాత్రం పరేడ్‌కు అనుమతించేది లేదని పేర్కొందని తెలిపారు. తమ వైఖరిని ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేశామని చెప్పారు.

దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీకి తరలి వస్తున్నారని తెలిపారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం, త్రివర్ణ పతాకం గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు…దేశ రాజధాని ఢిల్లీలోనే పరేడ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.