జర్నలిస్టులకు వాళ్ల ఆఫీసుల్లోనే ఉచితంగా వ్యాక్సిన్
ఢిల్లీలోని అన్ని మీడియా హౌస్ లలో మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
Delhi ఢిల్లీలోని అన్ని మీడియా హౌస్ లలో మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులందరికీ వాళ్ల వాళ్ల ఆఫీసుల్లోనే ఉచితంగా వ్యాక్సిన్ ను అందించనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కొవిడ్ పరిస్థితిపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంతోపాటు ఆరోగ్య మంత్రి, ఆరోగ్యశాఖ కార్యదర్శి, అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు హాజరయ్యారు.
హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత రాకుండా చూడాలని హై లెవల్ మీటింగ్ సమయంలో అధికారులను కేజ్రీవాల్ ఆదేశించారు. ప్రస్తుతం ఆక్సిజన్ పరిస్థితి కూడా అదుపులోనే ఉందన్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఏ ఒక్కరూ చనిపోకుండా చూడాలని,వ్యాక్సినేషన్ డ్రైవ్ ను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, ప్రతిరోజూ 2-3 వ్యాక్సినేషన్ సెంటర్లను సందర్శించి తనీఖీలు చేయాలని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లను కేజ్రీవాల్ ఆదేశించారు. రిలీఫ్ క్యాంప్ లను మరియు వృద్ధాశ్రమాల్లో కూడా ఆకస్మిక సందర్శనలు చేపట్టాలని సూచించారు.
ఇక,ఢిల్లీలో 18-45ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లోనే 1.84 లక్షల మందికి వ్యాక్సిన్ మొదటి డోసు ఇవ్వడం జరిగిందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. మొత్తంగా అన్ని వయస్సులవారికి కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు 38.88లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మరోవైపు ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 19832 కేసులు, 341 మరణాలు సంభవించాయి.