పుల్వామా దాడి సమాచారం ఆరు రోజుల ముందే
పుల్వామా ఉగ్రదాడిపై మరోసారి కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఉగ్రదాడి జరగడానికి ఆరురోజుల ముందే కాశ్మీర్ ఐజీ నుంచి ప్రధాని మోడీకి సమాచారం అందిందని, సీఆర్పీఎఫ్ బలగాలను రోడ్డు మార్గంలో తరలించడంపై ఆయన ముందుగానే హెచ్చరించారని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఆత్మాహుతి దాడిలో 44 మంది జవాన్లు అమరులు కావడం వెనక ఇంటెలిజెన్స్ లోపం ఉందన్నారు. ఇంటెలిజెన్స్ లోపం అంటూ వస్తున్న వార్తలపై అటు ప్రధాని మోదీ కానీ, ఇటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదని విమర్శించారు. బాలాకోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులను తానెప్పుడూ తప్పుబట్టలేదన్నారు.అంతర్జాతీయ మీడియా అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
గతంలో ఇదే విషయంపై దిగ్విజయ్ మాట్లాడుతూ..భారత వాయుసేన సామర్థ్యాన్ని తాను ఎంతమాత్రమూ శంకించడం లేదు. బాలాకోట్పై ఐఏఎఫ్ జరిపిన దాడికి సంబంధించిన చిత్రాలను ప్రజలకు చూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఆల్ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను హతమార్చినప్పుడు అమెరికా ఆధారాలు చూపెట్టిందన్నారు. అలాగే ఇప్పుడు భారత్ కూడా బాలాకోట్ దాడికి సంబంధించిన సాక్ష్యాలను చూపించాలని దిగ్విజయ్ డిమాండ్ చేశారు.