ఫస్ట్ బీజేపీకి డైవర్స్ ఇవ్వండి..శివసేనకు ఎన్సీపీ ఆఫర్

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2019 / 03:41 PM IST
ఫస్ట్ బీజేపీకి డైవర్స్ ఇవ్వండి..శివసేనకు ఎన్సీపీ ఆఫర్

మహరాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది.  బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే శివసేనతో కూడా కలిసేందుకు తాము సిద్దమేనని ఎన్సీపీ ప్రత్యక్షంగానే సంకేతాలు ఇస్తోంది. అయితే ఈ విషయమై శివసేనకు ఒక షరతు విధించింది ఎన్సీపీ. బీజేపీతో బంధం పూర్తిగా తెంచుకుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ఎన్సీపీ తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి పదవిని శివసేన వదులుకునేలా లేదు. అయితే బీజేపీ దీనికి ఒప్పుకోలేదంటే ప్రత్యామ్నాయం తప్పనిసరి. ఒకవేళ బీజేపీతో బంధాన్ని శివసేన శాశ్వతంగా తెంచుకున్నట్లైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న శివసేన పార్టీ నాయకుడు అరవింద్ సావంత్ కూడా తన పదవికి రాజీనామా చేయాలని,అప్పుడే ఎన్సీపీ తన కార్డ్స్ శివసేనకు ఓపెన్ చేస్తుందని ఎన్సీపీ నాయకులు తెలిపారు.

 గత నెల 24న వెలువడిన మహారాషట్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటిమికి స్పష్టమైన మెజారిటి వచ్చినప్పటికీ శివసేన 50:50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. సమ భాగస్వామ్యం కింద ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ తొలుత హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీపై శివసేన నేరుగానే దాడి చేస్తోంది.

50:50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకుంటే ఎన్సీపీ,కాంగ్రెస్ తో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా తాము సిద్దమేనని శివసేన నాయకులు సంకేతాలిస్తున్నారు. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం నవంబర్-8,2019తో ముగుస్తుంది. అప్పటిలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.