బీజేపీకి ఉద్దవ్ హెచ్చరిక : బలవంతం చేస్తే సుదర్శన చక్రం ప్రయోగిస్తా

  • Published By: venkaiahnaidu ,Published On : November 29, 2020 / 05:22 AM IST
బీజేపీకి ఉద్దవ్ హెచ్చరిక : బలవంతం చేస్తే సుదర్శన చక్రం ప్రయోగిస్తా

Uddhav Thackeray warns BJP బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శివసేన అధికారిక పత్రిక సామ్నాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఉద్ధవ్​ ఠాక్రే. ఈ సందర్భంగా పలు విషయాలపై ఉద్దవ్ చర్చించారు.



కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు దుర్వినియోగమవుతున్నాయని ఉద్దవ్ ఆరోపించారు. ఈ సంస్థల ద్వారా తమ కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకోవడాన్ని పరిశీలిస్తే విపక్ష పార్టీ కక్షసాధింపు రాజకీయాలు అవగతమవుతాయని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు.



మూడు రోజుల క్రితం మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శివసేన ఎంపి ప్రతాప్ సర్నాయక్‌ నివాసంలో సోదాలు నిర్వహించి అతని కుమారుడు విహాంగ్ సర్నాయక్‌ను అదుపులోకి తీసుకున్న విషయాన్నీ ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు ఉద్దవ్.



రాష్ట్రంలోని అన్ని రాజకీయ పరిణామాలను శివసేన గమనిస్తూనే ఉందని పేర్కొన్నారు ఠాక్రే. ‘తమ కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకోవాలని అనుకునేవారు… వారికీ కుటుంబాలు, పిల్లలు ఉన్న విషయాన్ని మర్చిపోరాదని’ హెచ్చరించారు.



కక్షసాధింపు రాజకీయాల జోలికి మా పార్టీ వెళ్లాలనుకోవడం లేదు. కానీ మీరు(బీజేపీ) బలవంతం చేస్తే మీపై సుదర్శన చక్రం ప్రయోగిస్తాం అని ఉద్దవ్ బీజేపీని హెచ్చరించారు. చేతులు కడుక్కోమని చెప్పడం మినహా కరోనా విషయంలో సీఎం చేసిందేమీ లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఉద్దవ్ స్పందించారు. ‘ప్రస్తుతం చేతులు కడుక్కోమనే చెబుతున్నాం.. ఇలాంటి విమర్శలు కొనసాగితే మీ వెంట పడతాం అని ఘాటుగా బదులిచ్చారు.



సీఎంగా సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్​కు కృతజ్ఞతలు తెలిపారు ఉద్దవ్ ఠాక్రే. ప్రభుత్వ ఏర్పాటులో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మూడు పార్టీలకు చెందిన సభ్యులు మద్దతు ఇవ్వడం వల్లే తాను పనిచేయగలుగుతున్నానని తెలిపారు.