Shashi Tharoor: భారత మొదటి ‘మేల్ ఫెమినిస్ట్’ డాక్టర్ బీఆర్ అంబేద్కర్
మహిళలు తమను తాము బలవంతంగా వివాహానికి అనుమతించవద్దని అంబేద్కర్ కోరారు. అలాగే వివాహం ఆలస్యం చేయాలని, ప్రసవం ఆలస్యం చేయాలని ఆయన కోరారు. అంతే కాకుండా తమ భర్తలకు సరిసమానంగా నిలవాలని కోరారు. అంబేద్కర్ ఒక శాసనసభ్యుడిగా మహిళలు, కార్మికుల కోసం పోరాడారు. 80-90 సంవత్సరాల క్రితమే ఆ వ్యక్తి గొప్ప స్త్రీవాద ఆలోచనవాది
Shashi Tharoor: భారతదేశపు మొట్టమొదటి పురుష స్త్రీవాది (మేల్ ఫెమినిస్ట్) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అటువంటి ఆలోచనలను అంబేద్కర్ దశాబ్దాల క్రితమే ప్రచారం చేశారని, అవే నేటి తరం రాజకీయ నాయకులకు ప్రగతిశీలమైనవిగా పరిగణించబడుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు, రచయిత శశిథరూర్ అన్నారు. శనివారం గోవా హెరిటేజ్ ఫెస్టివల్లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ‘అంబేద్కర్: ఏ లైఫ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన అరంతరం థరూర్ మాట్లాడుతూ ‘అంబేద్కర్ భారతదేశపు మొదటి పురుష స్త్రీవాది. 1920, 30, 40 దశకాల్లో ఆయన అనేక ప్రసంగాలు చేశారు. మహిళలు పాల్గొన్న సభల్లో కూడా అనేక సార్లు ప్రసంగించారు. నాడు అంబేద్కర్ చేసిన ప్రసంగాలు, నేడు ఒక పురుష రాజకీయవేత్తకు ప్రగతిశీలమైనవిగా పరిగణించబడుతున్నాయి’ అని అన్నారు.
ఇంకా థరూర్ మాట్లాడుతూ ‘మహిళలు తమను తాము బలవంతంగా వివాహానికి అనుమతించవద్దని అంబేద్కర్ కోరారు. అలాగే వివాహం ఆలస్యం చేయాలని, ప్రసవం ఆలస్యం చేయాలని ఆయన కోరారు. అంతే కాకుండా తమ భర్తలకు సరిసమానంగా నిలవాలని కోరారు. అంబేద్కర్ ఒక శాసనసభ్యుడిగా మహిళలు, కార్మికుల కోసం పోరాడారు. 80-90 సంవత్సరాల క్రితమే ఆ వ్యక్తి గొప్ప స్త్రీవాద ఆలోచనవాది’ అని అన్నారు. ‘అంబేద్కర్ను దళిత నాయకుడిగా చూసే ధోరణి ఉంది. ఆయన దేశంలోని ప్రధాన దళిత నాయకుడు. తన 20వ ఏట నుంచే ఒక ప్రభావవంతమైన గొంతు కలవారు. అప్పటి నుంచే ఆయన ప్రభావవంతంగా మారారు’ అని థరూర్ అన్నారు.
అంబేద్కర్ ఒక అసాధారణ రాజ్యాంగవేత్త, ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారని థరూర్ కొనియాడారు. రాజ్యాంగంలోని ప్రతి ఒక్క అంశాన్ని ఎంతో ఓర్పుతో కూర్పుతో అలంకరించి పొందుపర్చిన వ్యక్తని థరూర్ అన్నారు.