E-passports : ఈ-పాస్పోర్టులు వస్తున్నాయి.. ఇక మీ డేటా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
విదేశీ ప్రయాణం మరింత సులభతరం కానుంది. పాస్పోర్టు విధానం కూడా త్వరలో మారబోతోంది. పాత పాస్పోర్టుల స్థానంలో ఈ-పాస్ పోర్టులు రానున్నాయి.
E-passports : విదేశీ ప్రయాణం మరింత సులభతరం కానుంది. పాస్పోర్టు విధానం కూడా త్వరలో మారబోతోంది. పాత పాస్పోర్టుల స్థానంలో ఈ-పాస్ పోర్టులు రానున్నాయి. పాస్పోర్ట్ హోల్డర్ల డేటాను సురక్షితంగా ఉంచేందుకు భారత ప్రభుత్వం అతి త్వరలో ఈ-పాస్పోర్ట్లను ప్రారంభించనుంది. గత ఏడాది ఈ-పాస్పోర్ట్ల విధానం అమలుపై ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు ఈ ఏడాది చివరి నాటికి ఈ-పాస్పోర్ట్లు అందుబాటులోకి వస్తాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు. పాస్పోర్ట్ సేవా దివస్ 2022 సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం.. ఈ-పాస్పోర్ట్లతో పౌరసత్వ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
ఈ ఏడాదిలో జూన్ 24న పాస్పోర్ట్ సేవా దివస్ని స్మరించుకుంటూ.. తదుపరి స్థాయి పౌరుల అనుభవాన్ని అందించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా, చిప్ ఆధారిత ఈ-పాస్పోర్ట్ కొత్త కాన్సెప్ట్ కాదు. ఇప్పటికే 100కి పైగా దేశాలు ఈ-పాస్పోర్ట్లను అందిస్తున్నాయి. ఐర్లాండ్, జింబాబ్వే, మలవాయి, భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఈ-పాస్పోర్ట్లను విడుదల చేశాయని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ డేటా పేర్కొంది. ఈ-పాస్పోర్ట్ అంటే ఏమిటి? అంతర్జాతీయ ప్రయాణాన్ని ఎలా సులభతరం చేస్తుంది. పాస్ పోర్టు హోల్డర్ల డేటాను ఎలా సురక్షితంగా ఉంచగలదు అనే వివరాలతో పాటు చిప్ ఆధారిత ఈ-పాస్పోర్ట్లు ఎలా పనిచేస్తాయనేది ఇప్పుడు చూద్దాం..
ఇ-పాస్పోర్ట్ అంటే ఏమిటి? :
ఈ-పాస్పోర్ట్లు సాధారణ భౌతిక పాస్పోర్ట్ మాదిరిగానే పనిని చేస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్తో సమానంగా చిన్న ఎలక్ట్రానిక్ చిప్తో వస్తాయి. పాస్పోర్ట్ లోపల ఉపయోగించే చిప్ పాస్పోర్ట్ హోల్డర్.. అన్ని కీలకమైన వివరాలను స్టోర్ చేస్తుంది. ఈ డేటాలో పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఇతర విషయాలు ఉన్నాయి. ఈ ఈ-పాస్పోర్ట్లు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ని ఉపయోగిస్తాయి. వెనుక కవర్లో ఒక యాంటెన్నాను పొందుపరిచారు. ఈ చిప్ ప్రయాణికుల వివరాలను త్వరగా ధృవీకరించడానికి అధికారులను అనుమతిస్తుంది. నకిలీ పాస్పోర్ట్ల సర్క్యులేషన్ను తగ్గించడంతో పాటు భద్రతను మరింత మెరుగుపరచడం, డూప్లికేషన్ డేటా ట్యాంపరింగ్ను తగ్గించేందుకు ఈ-పాస్పోర్ట్ జారీ చేయనున్నట్టు అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ-పాస్పోర్ట్లను ఎవరు తయారు చేస్తారంటే? :
టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ-పాస్పోర్ట్లపై పని చేస్తోంది. భారత ప్రభుత్వం ఈ ఏడాది చివరి నాటికి ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. నివేదికల ప్రకారం.. TCS విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)తో ఒక కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రాజెక్ట్ అన్ని బ్యాకెండ్ అవసరాలకు సపోర్టు ఇచ్చేందుకు కొత్త డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది.
ఈ-పాస్పోర్ట్లు ఎప్పుడు వస్తాయంటే?
విదేశాంగ మంత్రి ధృవీకరించినట్లుగా.. ఈ ఏడాది చివరి నాటికి ఈ-పాస్పోర్ట్లు అందుబాటులోకి వస్తాయి. అయితే, నిర్దిష్ట తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
ప్రస్తుత పాస్పోర్ట్ హోల్డర్లు అప్గ్రేడ్ చేయాలా?
ప్రస్తుత పాస్పోర్ట్ హోల్డర్లందరూ ఈ-పాస్పోర్ట్కి అప్గ్రేడ్ కావాల్సి ఉంటుందా లేదా ఈ-పాస్పోర్ట్ కోసం అప్లయ్ చేయడానికి ఇప్పటికే ఉన్న పాస్పోర్ట్ గడువు ముగిసే వరకు వేచి ఉండాలా అని కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ-పాస్పోర్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ భౌతిక పాస్పోర్ట్ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. కొత్త దరఖాస్తుదారులు దేశంలో అధికారికంగా ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ-పాస్పోర్ట్లను పొందే అవకాశం ఉంది.
ఈ-పాస్పోర్ట్లు ఎలా ఉంటాయి?
భారత్లోని ఈ-పాస్పోర్ట్లు (ఇతర దేశాల మాదిరిగానే) చిప్ను ఇన్స్టాల్ చేసిన సాధారణ పాస్పోర్ట్లాగా కనిపిస్తాయి. మీరు అంతర్జాతీయంగా ప్రయాణించేటప్పుడు భౌతికంగా పాస్పోర్ట్ను తప్పక కలిగి ఉండాలి.
Read Also : Passport: ఇస్మార్ట్ పోస్టాఫీస్.. ఇకపై పాస్పోర్టు దరఖాస్తులు కూడా!