Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. మే 10న పోలింగ్, 13న ఫలితాలు
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది.
Karnataka Assembly Elections: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల కమిషన్ బుధవారం రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఒకే దశలో ఎన్నికల ప్రక్రియ పూర్తకానుంది. మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. నేటి నుంచి కోడ్ అమల్లోకి రానుంది. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 5,21, 73,579 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో కొత్తగా 9.17లక్షల మంది ఓటర్లు చేరారు. 100 ఏళ్లుపైబడిన ఓటర్లు 16వేలకుపైగా ఉన్నారు. తొలిసారిగా ఎన్నికల సంఘం 80ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్నికల్పించింది.
కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన స్థానాల సంఖ్య113. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి 119 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ 75 ఎమ్మెల్యేలు, జేడీఎస్ 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. మే 24తో అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ దఫా 150స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ మొదటివారంలో అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని కాంగ్రెస్ నేతలు దీమాతో ఉన్నారు. ఆ మేరకు వ్యూహాత్మంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ 124 స్థానాల్లో తొలి విడత అభ్యర్థుల జాబితానుసైతం ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో కీలకంగా మూడో పార్టీ జేడీఎస్. ఈ ఎన్నికల్లో జేడీఎస్- బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి. జేడీఎస్ ఇప్పటికే 93 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.