పదకొండు మంది అమ్మాయిలను చంపేసి ఉండవచ్చు: సీబీఐ

  • Published By: vamsi ,Published On : May 4, 2019 / 05:02 AM IST
పదకొండు మంది అమ్మాయిలను చంపేసి ఉండవచ్చు: సీబీఐ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌ పూర్‌ వసతి గృహంలో అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది సీబీఐ. సీబీఐ విచారణలో భయంకర నిజాలు వెలుగు చూసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ముజఫర్ పూర్‌ వసతి గృహంలో నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్ సాగించిన అకృత్యాలకు ఎందరో బాలికలు బలయ్యారని సీబీఐ వెల్లడించింది.

ఆశ్రయం పొందుతున్న అనాథ బాలికలకు ఆహారంలో మత్తుమందు ఇచ్చి బ్రజేష్ ఠాకూర్‌ లైంగికదాడులకు పాల్పడేవాడని సీబీఐ తెలిపింది. బ్రజేష్ ఠాకూర్ చెప్పినట్టు వినకపోతే బాలికలను దారుణంగా హింసించేవారని, కామవాంఛలు తీర్చేందుకు నిరాకరిస్తే చంపేసేవాడని.. బాలికల మర్మాంగాలను గాయపరిచేవాడని అక్కడి బాలికలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు.

కేసు విచారణలో భాగంగా ముజఫర్ పూర్‌ షెల్టర్‌ హోం ఆవరణలో జరిపిన తవ్వకాల్లో ఒక అస్థిపంజరం బయటపడింది. తన మాట విననందుకు చంపి పాతిపెట్టారని సీబీఐ చెప్పింది.  బ్రజేష్ ఠాకూరే ఈ హత్య చేశాడని సాక్షాత్తూ అతని డ్రైవరే చెప్పినట్లు సీబీఐ తెలిపింది. ఇక షెల్టర్ నుంచి మిస్ అయిన 11మంది బాలికలు చనిపోయి ఉండవచ్చునని సీబీఐ తెలిపింది.

వసతీ గృహంలో మిస్ అయిన బాలికలు, పేర్లతో పోలికలతో 35మందిని గుర్తించగా వారిని విచారించిన సమయంలో 11మంది బాలికలను బ్రజేష్ టాకూర్ చంపి ఉండవచ్చునని తెలిపారు. ఈ కేసులో బీహార్ మాజీ మంత్రి మంజూవర్మ భర్త ప్రమేయం కూడా ఉందని అనుమానాలు రేకెత్తాయి. దీంతో గతేడాది ఆగస్టులో మంజూ వర్మ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రాజేష్ థాకూర్‌ని కలిసేందుకు వసతి గృహాలకు కొందరు అతిథులు వచ్చే వారని, వారి కోరికలు తీర్చేందుకు బాలికలను పంపించేవారని విచారణలో తేలింది. వసతి గృహంలో నగ్నంగా డ్యాన్స్ చేసిన వారికి మాత్రమే ఆ పూట బోజనం పెట్టేవారని బాధిత బాలికలు వివరించినట్లు సుప్రీంకోర్టు నివేదికలో సీబీఐ చూపింది.