నిత్యానందకు ఆశ్రయంపై ఈక్వెడార్ క్లారిటీ
రేప్ కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన స్వయం ప్రకటిత దేవుడు నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై భారత్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. నిత్యానందకు తాము ఎలాంటి సాయం చేయలేదని తెలిపింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. దీంతో అతను ఈక్వెడార్ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పింది. ఈక్వెడార్ నుంచి నిత్యానంద ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలను ఖండించింది. నిత్యానందకు చెందిన కైలాస వెబ్సైట్లోని సమాచారం ఆధారంగా పలు కథనాలు వెలువడ్డాయని.. అందులో వాస్తవాలు లేవని తెలిపింది. నిత్యానందకు సంబంధించిన విషయాల్లో ఈక్వెడార్ పేరును వాడటం మానుకోవాలని మీడియాను కోరింది.
మరోవైపు నిత్యానంద పాస్పోర్ట్ రద్దు చేసిందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం(డిసెంబర్-6,2019) తెలిపింది. గత నెల నుంచి కనబడకుండా పోయిన నిత్యానంద ఆచూకీని కనుగొనేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. అలాగే కొత్త పాస్పోర్ట్కై అతను పెట్టుకున్న దరఖాస్తు పోలీసు క్లియరెన్స్ పొందకపోవడంతో పెండింగ్లో ఉందన్నారు. నిత్యానంద కైలాస దేశంపై స్పందిస్తూ.. ఒక దేశం ఏర్పాటు చేయడం వెబ్సైట్ ఏర్పాటు చేసినంత సులువైన పని కాదని అన్నారు. నిత్యానంద గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని విదేశీ ప్రభుత్వాలను కోరినట్లు రవీష్ తెలిపారు.
ఈక్వెడార్ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు దానికి కైలాస పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓ వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తోందని అందులో తెలిపారు.
Embassy of Ecuador to India on fugitive self-styled godman Nithyananda: We categorically deny the statement, wherever published, that self-styled guru Nithyananda was given asylum by Ecuador. pic.twitter.com/6aN4C4V9VW
— ANI (@ANI) December 6, 2019