సైన్యంలో సత్తా ఉందన్న మోడీ : దేశ రక్షణకు దేనికైనా సిద్ధం
దేశ రక్షణకు ఎలాంటి చర్యలకైనా సిద్ధం..సైనికులపై పూర్తి నమ్మకం ఉంది..భారత్ ఎన్నటికీ వెనుకడుగు వేయదని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా పాక్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28వ తేదీన Mera Booth Sabse Mazboot పేరిట ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన ఇంటరాక్షన్ నిర్వహించారు. కోటి మందితో ఒకేసారి టెలీకాన్ఫరెన్స్లో మోడీ మాట్లాడారు. సరిహద్దులో నెలకొన్న పరిస్థితిపై మోడీ పలు వ్యాఖ్యలు చేశారు. భారత్కు నష్టం చేయాలని పాక్ అనుకొంటోందని, ఎవ్వరికీ భయపడాల్సినవసరం లేదన్నారు. పాక్ కుట్రలను బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా పోరాడుతాం..తమలో ఆత్మవిశ్వాసం ఉందని మోడీ వెల్లడించారు.
మరోవైపు భారత్ – పాక్ సరిహద్దులో ఎలాంటి పరిస్థితి నెలకొందనే దానిపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ త్రివిద దళాధిపతులతో మీటింగ్ నిర్వహించారు. యుద్ధ సన్నద్ధతపై మంత్రి ఆరా తీశారు. పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలను భారత బలగాలు తిప్పికొడుతామని త్రివిద దళాధిపతులు వివరించారు. సాయంత్రం 4గంటలకు రక్షణ మంత్రిని అజిత్ దోవల్ కలువనున్నారు. ఈ భేటీ అనంతరం భారత్ – పాక్ మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే దానిపై ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.