సీఎంకి నిద్రభంగం..అతిథి గృహం ఇంజినీర్లు సస్పెండ్
Suspended ఓ వైపు దోమలు, మరోవైపు ట్యాంకు నిండి నీరు కారుతున్న శబ్ధంతో అతిథి గృహంలో బస చేసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు ఓ రాత్రి కాళరాత్రి అయ్యింది.చివరకు సీఎం బస చేసిన ఆ అతిథి గృహం ఇంజినీర్లపై వేటు పడింది.బుధవారం(ఫిబ్రవరి-17,2021)ఈ ఘటన జరిగింది
మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలు, గాయపడినవారిని పరామర్శించేందుకు బుధవారం సీఎం శివరాజ్ సింగ్ “సిధి” వెళ్లారు. ఆ రాత్రి అతిథి గృహమైన సర్క్యూట్ హౌస్లో బస చేశారు. అయితే సీఎం బస చేసిన గది నిండా దోమలున్నాయి. దోమ తెరను కూడా సిబ్బంది ఏర్పాటు చేయలేదు. దోమల గురించి ఫిర్యాదు చేయడంతో అర్థరాత్రి 2.30 గంటలకు స్పందించిన సిబ్బంది దోమల మందును పిచికారి చేశారు. అనంతరం సీఎం శివరాజ్కు కాస్త నిద్రపట్టగా తెల్లవారుజామున 4 గంటలకు ట్యాంకు నుంచి నీరు కారుతున్న శబ్దానికి నిద్రభంగమైంది.
మోటార్ను ఎవరూ ఆపకపోవడంతో కొద్ద్దిసేపటి తర్వాత సీఎం స్వయంగా స్విచ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ రాత్రి నిద్రపట్టని కాళరాత్రిగా మిగిలింది. అతిథి గృహంలో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణం, అధికారుల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో సీఎం చౌహాన్ ఆదేశాలతో సిధి సర్క్యూట్ హౌస్ ఇంచార్జ్ అయిన సబ్ ఇంజనీర్ బాబులాల్ గుప్తా, మరో ఇంజనీర్ను అధికారులు సస్పెండ్ చేశారు. వీఐపీ బస చేస్తారని ఇంచార్జ్ బాబులాల్కు చెప్పినప్పటికీ నిర్లక్ష్యగా వ్యవహరించారని, అపరిశుభ్రత, దోమలపై ఫిర్యాదు అందడంతో ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు శుక్రవారం వారిని సస్పెండ్ చేసినట్లు రేవా డివిజనల్ కమిషనర్ రాజేష్ కుమార్ జైన్ తెలిపారు.