కారు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే,భార్య మృతి 

  • Published By: veegamteam ,Published On : April 7, 2019 / 06:07 AM IST
కారు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే,భార్య మృతి 

డ్రైవర్ల నిర్లక్ష్యం..అతి వేగం..వెరసి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ కంటైనర్ లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన కారు ప్రమాదానికి మూడు ప్రాణాలు బలైపోయాయి. మృతుల్లో మాజీ ఎమ్మెల్యే సుందరవేల్‌ తో సహా భార్య తో డ్రైవర్ మృతి చెందారు.  ఈ ఘటన తమిళనాడులోని ఆంబూరులో చోటుచేసుకుంది.
 

వేలూరు జిల్లా తిరుపత్తూరు మాజీ ఎమ్మెల్యే సుందరవేల్‌ ఆయన భార్య విజయలక్ష్మి ఏప్రిల్ 7న చికిత్స కోసం చెన్నై ఆస్పత్రికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో దారి మధ్యలో ఆంబూరు వద్ద ఉదయం 6 గంటల సమయంలో కారు ముందు వెళుతున్న కంటైనర్ లారీని ఓవర్ టేక్ చేసేందుకు డ్రైవర్ వీరమణి ప్రయత్నించాడు. దీంతో అతివేగంగా వెళ్లుతున్న కారు అదుపుతప్పి లారీ వెనుకభాగాన్ని ఢీకొట్టింది. దీంతో కారు లారీ వెనుకచక్రాల క్రిందకు దూసుకుపోయి ఇరుక్కుపోయింది. 
 

దీన్ని  గమనించని కంటైనర్ లారీ డ్రైవర్ కారును 25 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో లారీ వెనుక పెద్ద సౌండ్ రావటాన్ని గమనించి డ్రైవర్ లారీ ఆపి చూడగా, కారు లారీ కింద ఇరుక్కుపోయింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమందించాడు. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే సుందరవేల్, ఆయన భార్య విజయలక్ష్మీ తో పాటు డ్రైవర్ వీరమణి అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను అధికారులు  బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సుందరవేల్‌ 1991–96 వరకు తిరుపత్తూరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా పనిచేశారు. 2001 నుంచి 2006 వరకు తిరుపత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం అన్నాడీఎంకే అముముక పట్టణం కార్యదర్శిగా పనిచేస్తున్నారు.