కేంద్రం ప్రతిపాదనలు మాకొద్దు.. కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తేనే ఆందోళ‌న‌లు‌ విర‌మిస్తాం

  • Published By: bheemraj ,Published On : December 9, 2020 / 04:18 PM IST
కేంద్రం ప్రతిపాదనలు మాకొద్దు.. కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తేనే ఆందోళ‌న‌లు‌ విర‌మిస్తాం

Farmers’ unions reject Centre’s proposals : కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం పెట్టిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. ఈ ప్రతిపాదనలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చేశారు. కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తూ ఆందోళ‌న చేస్తున్న రైతుల ముందు కేంద్రం ప్రతిపాదనలు పెట్టింది. క‌నీస మ‌ద్దతు ధ‌ర‌ను క‌ల్పించేందుకు హామీ ఇస్తున్నట్లు లేఖ రాసింది. కావాలంటే లిఖిత‌పూర్వంగా కూడా తాము హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని కూడా కేంద్రం వెల్లడించింది. కానీ మూడు వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తేనే ఆందోళ‌న‌ల‌ను విర‌మిస్తామ‌ని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. కేంద్ర ప్రతిపాదనకు నో చెప్పేశారు.



కేంద్రం చేసిన ప్రతిపాదనలపై రైతు సంఘాల నేతలు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రైతులు ఆందోళన విరమిస్తారనే ప్రచారం జరుగుతోంది. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కుదరదన్న కేంద్ర ప్రభుత్వం.. రైతుల ఆందోళన నేపథ్యంలో సవరణలు చేసేందుకు అంగీకరించింది. రైతు డిమాండ్లు, మూడు వ్యవసాయ చట్టాల్లో సవరణలకు సంబంధించి పలు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలను రైతు సంఘాలకు లిఖితపూర్వకంగా పంపింది.



కేంద్రం ప్రతిపాదనల్లో కీలకమైనవి కొన్ని ఉన్నాయి. ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణకు అంగీకరించింది. అలాగే ఏపీఎంసీలపై సవరణలకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రైవేటు కొనుగోలుదారులతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పు చేస్తామంది.

వ్యాపారులు-రైతుల ఒప్పంద వివాద పరిష్కారంలో సబ్ కలెక్టర్‌ అధికారాలకు సైతం అంగీకరించింది. కాంట్రాక్టు వ్యవసాయంలో రైతులు సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించేలా చట్టంలో సవరణ చేస్తామంది.



కాంట్రాక్టు వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ కల్పించేలా మరో సవరణ చేయడానికి కేంద్రం అంగీకరించింది. అన్నిటికన్నా ముఖ్యంగా.. కనీస మద్ధతు ధరపై రాతపూర్వక హమీ ఇస్తామని కేంద్రం ప్రతిపాదించింది. పంట వ్యర్థాల దహనం అంశంపై పంజాబ్, హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.



కేంద్ర ప్రతిపాదనలపై చర్చిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులు.. సాయంత్రం 5 గంటల తర్వాత తమ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. మద్దతు ధర కల్పించేందుకు, కాంట్రాక్ట్‌ ఒప్పంద వివాదాల పరిష్కారాలకు పలు సవరణలకు అంగీకరించిన నేపథ్యంలో ఆందోళన వీడతారని ప్రచారం జరుగుతోంది.



అయితే గ‌త కొన్ని రోజులుగా కేంద్ర ప్ర‌భుత్వం, రైతుల మ‌ధ్య జ‌రిగిన‌ ప‌లు ద‌ఫాల చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నిన్న జ‌రిగిన భేటీ కూడా నిష్ఫ‌లంగా తేలింది. సింఘూ స‌రిహ‌ద్దు వ‌ద్ద ధ‌ర్నా చేస్తున్న రైతుల‌కు తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం లేఖ‌ను పంపింది. ఆ లేఖ‌ను అందుకున్న రైతులు దానిపై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం పంపిన ముసాయిదాపై తాము నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు బీకేయూ అధ్య‌క్షుడు మ‌న్‌జీత్ సింగ్ తెలిపారు.