తొలుత జ్వరం, తర్వాత దగ్గు, కండరాల నొప్పి, వాంతులు.. కరోనా లక్షణాల క్రమం ఇదే

  • Published By: naveen ,Published On : August 16, 2020 / 05:19 PM IST
తొలుత జ్వరం, తర్వాత దగ్గు, కండరాల నొప్పి, వాంతులు.. కరోనా లక్షణాల క్రమం ఇదే

ఇప్పటికే కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మరోవైపు ఇది సీజనల్‌ వ్యాధుల సమయం. దీంతో జనాలు హడలిపోతున్నారు. జ్వరం వస్తే ఏది కరోనానో.. ఏది మామూలు జ్వరమో తెలియక బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని సదరన్‌ కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన అధ్యయనాన్ని వెల్లడించారు. కరోనా సోకినప్పుడు మొదట ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. తర్వాత క్రమంగా ఎలాంటి లక్షణాలు బయటపడుతాయో అందులో తెలిపారు. కరోనా లక్షణాల ఆర్డర్ ను డీకోడ్ చేశారు.



వారి అధ్యయనం ప్రకారం కరోనా సోకిన వారిలో మొదట జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత దగ్గు, కండరాల నొప్పి, వికారం, వాంతులు, డయేరియా లక్షణాలు వరుస క్రమంలో బయటపడుతాయి. ఈ సమాచారం కొవిడ్‌ చికిత్సలో, సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ పీటర్‌ కున్‌ తెలిపారు.



కరోనా వైరస్ సోకితే రోగి శరీరంలో ముందుగా ఏ లక్షణం బయటపడుతుంది? లక్షణాల క్రమం ఏంటి? ఇప్పటివరకు ఇది చాలా పెద్ద చిక్కు ప్రశ్న. కానీ ఇక ముందు కాదు. ఎట్టకేలకు శాస్త్రవేత్తలు కరోనా లక్షణాల ఆర్డర్ ను డీకోడ్ చేశారు. ఇది చాలా ఉపయోగకరమైన అంశం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లక్షణాల ఆర్డర్ తెలియడం ద్వారా తర్వాత వచ్చే రోగాలను ముందే నివారించ వచ్చని అంటున్నారు. తద్వారా పేషెంట్లకు సరైన జాగ్రత్తలు అందుతాయని, సెల్ఫ్ ఐసోలేట్ కావడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. Frontiers in Public Health జర్నల్ లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం, కరోనా బారిన పడిన రోగికి ముందుగా జ్వరం వస్తుంది. ఆ తర్వాత దగ్గు వస్తుంది. ఆపై కండరాల నొప్పి, వికారం లేదా వాంతులు, ఆ తర్వాత విరేచనాలు. ఇదీ కరోనా లక్షణాల ఆర్డర్.



లక్షణాల ఆర్డర్ తెలుసుకోవడం చాలా అవసరం. ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఈ ఆర్డర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అది కరోనా లేదో కాదో సులువు తెలుసుకోవచ్చు అని సదర్న్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో మెడిసిన్ అండ్ బయోమెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ పీటర్ కున్ చెప్పారు. అలాగే ఈ కొత్త సమాచారం డాక్టర్లకు కూడా యూజ్ ఫుల్ గా ఉంటుందన్నారు. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా డాక్టర్లు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.



అలాగే ముందుగానే వ్యాధిని గుర్తించడం ద్వారా ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి తప్పుతుందన్నారు. కరోనా మహ్మమారి వచ్చిన తొలి రోజులతో పోలిస్తే ప్రస్తుతం మెరుగైన చికిత్సా విధానం అందుబాటులో ఉందన్నారు. చైనాకు చెందిన 55వేల మంది కరోనా రోగులపై అధ్యయనం చేశాక ఈ నివేదిక తయారు చేశారు. ఫిబ్రవరి 16 నుంచి 24వ తేదీ వరకు నమోదైన కేసుల వివరాలను డబ్ల్యూహెచ్ఓ నుంచి సేకరించి వాటిపై అధ్యయనం చేశారు. అలాగే నేషనల్ హెల్త్ కమిషన్ ఆఫ్ చైనా సాయంతో 2019 డిసెంబర్ 11 నుంచి 2020 జనవరి 29 వరకు 1100 మంది కరోనా రోగుల వివరాలు సేకరించి అధ్యయనం చేశారు.

శాస్త్రవేత్తలు కరోనా లక్షణాల ఆర్డర్ ను ఇన్ ఫ్లూయెంజాతో పోల్చారు. నార్త్ అమెరికాలో 2వేల 470 కేసుల డేటాను, యూరప్, సదరన్ హెమీస్పియర్ నుంచి డేటాను సేకరించారు. 1994 నుంచి 1998 మధ్య డేటాను హెల్త్ అధికారుల ద్వారా సేకరించారు.



ఈ ఆర్డర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లక్షణాల ఆర్డర్ తెలుసుకోవడం ద్వారా డాక్టర్లు ముందుగానే గుర్తించి రోగికి మెరుగైన వైద్యం ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఇది కరోనా కాదా అనే విషయం ముందే తెలిస్తే మెరుగైన ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు దోహద పడుతుందన్నారు.

కరోనా, సార్స్, మెర్స్.. ఈ మూడింటిలో తొలి రెండు లక్షణాలు జ్వరం, దగ్గు. కాగా కొవిడ్ 19 రోగుల్లో లోయర్ GI ట్రాక్ట్(విరేచనాలు) కన్నా ముందుగా అప్పర్ GI ట్రాక్ట్(వికారం లేదా వాంతులు) ముందుగా అఫెక్ట్ అవుతుంది. మెర్స్, సార్స్ తో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నం. రీసెర్చ్ ప్రకారం, చాలా తక్కువ మంది కరోనా రోగుల్లో మాత్రమే అన్నింటికన్నా ముందుగా డయేరియా లక్షణం బయటపడింది. కాగా, డయేరియా ముందుగా బయటపడిన కరోనా రోగుల్లో ఆరోగ్య పరిస్థితి విషమించింది. న్యూమోనియా లేదా శ్వాస కోశ వ్యవస్థ విఫలం అవ్వడం జరిగింది. ఎక్కువ మందిలో ముందుగా జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత దగ్గు బయటపడింది. తక్కువ శాతం మందిలో డయేరియా లక్షణాలు ముందుగా బయటపడ్డాయి.