దేశంలోనే తొలి ఓటరు ఘనత : 102 ఏళ్ల వయస్సులోను రెడీ
కల్పా : ఓటు సామాన్యుని హక్కు. ఆ హక్కుని దేశానికి స్వతంత్ర్యం వచ్చిన నాటి నుంచి జరిగిన ప్రతీ ఎన్నికల్లోను ఓటు వేసిన ఘనత అతనిది. భారత దేశంలోని తొలి ఓటరుగా చరిత్ర సృష్టించిన అతని పేరు శ్యామ్ శరణ్ నేగి. సెప్టెంబర్ 4 1917లో జన్మించిన నేగి ఈ సార్వత్రికి ఎన్నికల్లో మరోసారి ఓటేసేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. 1947లో దేశానికి స్వతంత్ర్యం వచ్చిన తరువాత 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు మొదలు ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ శ్యామ్ శరణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్న ఏకైక ఓటరుగా ఆయన రికార్డులకెక్కారు. హిమాచల్ ప్రదేశ్లోని కల్పా గ్రామానికి చెందిన శ్యామ్ నేగి వయసు ఇప్పుడు 102 ఏళ్లు కావడం విశేషం. హిమాచల్ ప్రదేశ్లో మే 19న ఎన్నికలు జరగనున్న క్రమవంలో తన ఓటుహక్కుని వినియోగించుకునేందుకు శ్యామ్ సిద్ధంగా ఉన్నారు.
మంచు కరుస్తున్నా..గడ్డ కట్టించే చలి వణికిస్తున్నా..ఏదైనా అనారోగ్య కారణాలు వచ్చినా..ఇలా ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా 102 ఏళ్ల వయసులోనూ నేగి ఓటేయడం అంటే ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఎన్నికలు ఏవైనా..తమ ఊళ్లో తొలి ఓటు తానే వేయాలని ఉబలాడుతుంటారు నేగి. 1951లో దేశంలో తొలిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అందరి కంటే ముందు నేగి ఓటేశారట. గాంధీ సిద్ధాంతాలను గౌరవిస్తు..ఆచరించే ఆయన చాలా కాలం వరకు కాంగ్రెస్ పార్టీని అమితంగా ఇష్టపడుతుంటారు. 2010 లో ఎన్నికల సంఘం డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా కల్పా గ్రామాన్ని సందర్శించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా నేగిని సత్కరించారు.