Nitish Kumar: నితీశ్ కుమార్కు షాకిచ్చిన బీజేపీ.. మణిపూర్లో జేడీ(యూ) ఖాళీ ..! ఐదుగురు ఎమ్మెల్యేలు భాజపాలో విలీనం
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్కు బీజేపీ గట్టి షాకిచ్చింది. కొద్దిరోజుల క్రితం నితీశ్ ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకున్నారు. ఈ క్రమంలో మణిపూర్ రాష్ట్రంలోని ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యే బీజేపీలో విలీనమయ్యారు.
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్కు బీజేపీ గట్టి షాకిచ్చింది. కొద్దిరోజుల క్రితం నితీశ్ ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకున్నారు. బీహార్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరోసారి సీఎంగా నితీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా ఆయన జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో పట్నాలోని పార్టీ కార్యాలయంలో జేడీయూ జాతీయ స్థాయి సమావేశం సైతం నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మణిపూర్లో జేడీయూకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు నితీశ్ కుమార్కు షాకిస్తూ బీజేపీలో చేరారు.
ఈ ఏడాది మార్చిలో మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం విధితమే. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 32 స్థానాల్లో విజయం సాధించింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీ(యూ)కు ఆరు సీట్లు లభించాయి. కొద్ది రోజుల క్రితం బీహార్ లో నితీశ్ కుమార్ ఎన్డీయేతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో మణిపూర్ లోని ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం అధికార బీజేపీతో కలిసినట్లు మణిపూర్ అసెంబ్లీ సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది.
జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం కావటాన్ని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద స్పీకర్ ఆమోదించినట్లు ఆ ప్రకటన పేర్కొంది. బీజేపీలో చేరిన జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో ఖుముక్ చమ్, న్గుర్ సంగ్లూర్ సనేట్, అచాబ్ ఉద్దీన్, తంగ్జామ్ అరుణ్ కుమార్, ఎల్.ఎం. ఖౌటే ఉన్నారు. గత తొమ్మది రోజుల్లో నితీష్ కుమార్ కు చెందిన జేడీ(యూ)కు ఇది రెండోదెబ్బ. ఆగస్టు 25న అరుణాచల్ ప్రదేశ్ లో ఏకైక జేడీ(యూ) ఎమ్మెల్యే టేకి కాసో ఆ పార్టీని వీడి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ చేరాడు. మణిపూర్ లో జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనమైన తరువాత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై బీజేపీ నేతలు సుశీల్ మోడీ, అమిత్ మాలవీయలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మణిపూర్, అరుణాచల్ రాష్ట్రాల్లో జేడీ(యూ) ముక్త్ గా మారాయని అన్నారు. అతిత్వరలోనే లాలూజీ బీహార్ నుంచి జేడీ(యూ)ను పారదోలతారని అన్నారు.