Five States Election 2022 : మూడు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల పోలింగ్
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, ఆయన సతీమణి గీత ఖతిమా లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వీరు కాషాయ కండువాలను ధరించడం ద్వారా కోడ్ ఉల్లంఘనకు...
Five States Election 2022 : మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరాఖండ్, గోవాలో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగులు, ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, ఆయన సతీమణి గీత ఖతిమా లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వీరు కాషాయ కండువాలను ధరించడం ద్వారా కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శలు వెల్లువెత్తాయి. ఉత్తరాఖండ్లో దాదాపు 65శాతం పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు ఒక్క విడతలోనే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక్కడ 75శాతానికి పైగా పోలింగ్ జరిగింది.
Read More : Railways Training : పదిపాసైతే చాలు..ఉచిత శిక్షణతోపాటు, రైల్వేలో ఉద్యోగం
ఉత్తరప్రదేశ్లో రెండో విడుతలో 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో విడత ఎన్నికలు జరిగిన ప్రాంతాలు ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు కావడంతో వారు ఎటు మొగ్గు చూపారోనన్న టెన్షన్ పార్టీల్లో ఉంది. వారి ఓట్లు చీలితే అది తమకు లాభమేనని బీజేపీ భావిస్తోంది. రెండో విడతలో 60శాతం పోలింగ్ జరిగింది. మరోవైపు… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం యూపీ, పంజాబ్ లో ఆయన ఎన్నికల సభలో పాల్గొన్నారు. పంజాబ్లో తాను అమ్మవారి దర్శనం కోసం వస్తే తనని ప్రభుత్వం అడ్డగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. జలంధర్లో జరిగిన ఎన్నికల సభలో పంజాబ్ ప్రభుత్వం, కాంగ్రెస్ తీరుపై మోదీ మండిపడ్డారు. తాను ఎన్నికల ప్రచారానికి ముందు శక్తిపీఠం దేవీ త్రిపుర మాలినిని దర్శించుకుందామని భావించాను. అయితే ఇక్కడి పోలీసులు, ప్రభుత్వం తనని అడ్డుకుందని విమర్శించారు.
Read More : Adavallu Meeku Joharlu: శర్వా – రష్మిక ఫ్యాన్స్కు వాలంటైన్స్ డే ట్రీట్.. ఓ మై ఆద్యా..!
గత పంజాబ్ పర్యటనలో తనకు ఎదురైన అనుభావాలను సభలో వ్యక్తీకరించారు మోదీ. అభివృద్ధిని పక్కనబెట్టి సీఎం కుర్చీని కాపాడుకునేపనిలో పడ్డారని సీఎం చన్నీ, సిద్ధూలపై విరుచుకుపడ్డారు. అంతకు ముందు కాన్పూర్లో జరిగిన ఎన్నికల సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. సమాజ్వాదీ పార్టీకి ఓటేస్తే తిరిగి మాఫియా పుంజుకుంటుందని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహా ఊపుతో రాబోతోందని తొలి విడత పోలింగ్, రెండో విడత ఓటింగ్ సరళిని బట్టి స్పష్టమవుతోందన్నారు.