Amritsar: ప్రయాణికుల్ని వదిలేసి ఐదు గంటల ముందే వెళ్లిపోయిన విమానం.. విచారణకు ఆదేశించిన డీజీసీఏ
పంజాబ్, అమృత్సర్ ఎయిర్పోర్టులో ఒక విమానం ఏకంగా ఐదు గంటల ముందే బయల్దేరి వెళ్లిపోయింది. అమృత్సర్ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన స్కూట్ ఎయిర్లైన్స్ విమానం షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి 07.55 నిమిషాలకు బయల్దేరాల్సి ఉంది.
Amritsar: సాధారణంగా విమానాలు షెడ్యూల్కు అనుగుణంగానే బయల్దేరుతాయి. అప్పుడప్పుడూ ఆలస్యం కావొచ్చు. ఒకవేళ విమానం ముందు బయల్దేరినా కొన్ని నిమిషాల ముందు మాత్రమే వెళ్తుంది. కానీ, పంజాబ్, అమృత్సర్ ఎయిర్పోర్టులో ఒక విమానం ఏకంగా ఐదు గంటల ముందే బయల్దేరి వెళ్లిపోయింది.
ప్రయాణికులు ఎయిర్పోర్టుకు కూడా రాకముందే వెళ్లిపోయింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అమృత్సర్ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన స్కూట్ ఎయిర్లైన్స్ విమానం షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి 07.55 నిమిషాలకు బయల్దేరాల్సి ఉంది. అయితే, దాదాపు ఐదు గంటలు ముందుగా.. అంటే మధ్యాహ్నం 03.00 గంటలకే విమానం వెళ్లిపోయింది. అప్పటికి చాలా మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుకు కూడా రాలేదు. మొత్తం 35 మంది ప్రయాణికుల్ని వదిలేసి ఆ విమానం వెళ్లిపోయింది. దీంతో నిర్ణీత సమయానికి అనుగుణంగా ఎయిర్పోర్ట్ చేరుకున్న ప్రయాణికులు విషయం తెలుసుకుని షాకయ్యారు. ఎయిర్పోర్టులో నిరసనకు దిగారు. ఎయిర్పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు.
Telangana : ఐదేళ్ల క్రితం నరేశ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..
దీంతో అధికారులు విమానయాన సంస్థను సంప్రదించగా, తాము ముందుగానే షెడ్యూల్లో మార్పు చేశామని, ఈ విషయాన్ని ప్రయాణికుల్ని మెయిల్ ద్వారా తెలియజేశామని చెప్పింది. విమానంలో మొత్తం 280 మందికిపైగా ప్రయాణికులు వెళ్లాల్సి ఉండగా, 253 మంది ప్రయాణికులతోనే బయల్దేరింది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్లైన్స్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.