ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం!
FM Nirmala Sitharaman : అందరూ ఊహించినట్టే జరిగింది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది కేంద్రం. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా..2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.
2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 3 వేల 500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు, ఇందుకు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మధురై – కొల్లామ్ కారిడార్, చిత్తూరు – తత్పూరు కారిడార్ ప్రాంతాల్లో ఈ రహదారుల నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది నుంచే పనులు ప్రారంభమౌతాయని చెప్పారు. ఏప్రిల్, మే నెలలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 6700 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి దాదాపు 25వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తెలిపారామె.
ఇక కేరళ రాష్ట్రానికి కూడా భారీగానే కేటాయింపులు చేసింది కేంద్రం. 1100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం 65 వేల కోట్లను కేటాయించనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందుకు రూ. 65 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు సభలో ప్రకటించారు. ముంబై-కన్యాకుమారి కారిడార్ ను కూడా దీనిలో భాగంగానే నిర్మాణం చేయనున్నారు.
19వేల కోట్ల రూపాయలతో అసోంలో రహదారుల నిర్మాణం జరుగనుంది.
ఎన్నికల నేపథ్యంలో భారీగా కేటాయింపులు చేశారనే టాక్ వినిపిస్తోంది. 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు, ఖరగ్పూర్ – విజయవాడ మధ్య ఈస్ట్ – కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఉంటుందన్నారు. ప్రపంచ యుద్ధాల తర్వాత ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రపంచం మారిందని చెప్పారు. ఇప్పుడు కరోనా తర్వాత కూడా మనం మరో కొత్త ప్రపంచంలో ఉన్నామని, లాక్డౌన్ వల్ల అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కనీవినీ ఎరుగని పరిస్థితుల్లో ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు, కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ ప్యాకేజీలు లాక్డౌన్ కష్టాలను కొంత వరకూ తగ్గించాయన్నారు. ఐదు ప్యాకేజీలు ఐదు బడ్జెట్లతో సమానమని చెప్పారు మంత్రి నిర్మలా సీతారామన్.