అక్టోబర్-15 నుంచి కొత్త విద్యాసంవత్సరం…AICTE

  • Published By: venkaiahnaidu ,Published On : July 9, 2020 / 07:08 PM IST
అక్టోబర్-15 నుంచి కొత్త విద్యాసంవత్సరం…AICTE

దేశవ్యాప్తంగా వృత్తివిద్య, సాంకేతిక విద్యాసంస్థలు అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభమవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి సవరించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ షెడ్యూల్‌ను సవరించి కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది

టెక్నికల్‌ కోర్సుల్లో కొత్తగా చేరే విద్యార్థులకు, రెండో ఏడాదిలో ప్రవేశించే వారికి అక్టోబర్‌ 15 నుంచి, మిగిలినవారికి ఆగస్టు 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని AICTE తెలిపింది. అదేవిధంగా మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంలు, కోర్సులకు సంబంధించి ఆగస్టు 17 వరకు పూర్తిచేయాలని చెప్పింది

కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షలు, అకడమిక్‌ క్యాలెండర్‌ను సవరించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ జూలై 6న కోరింది. దీంతో యూజీసీ నియమావళి ప్రకారం కొత్త అడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించామని ఏఐసీటీఈ తెలిపింది.

దీనిప్రకారం వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు సంబంధించి అక్టోబర్‌-5 లోపు మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను పూర్తిచేయాలని, అక్టోబర్-15 నాటికి రెండో విడత కౌన్సెలింగ్‌ను ముగించాలని అన్ని సాంకేతిక, వృత్తివిద్యా కళాశాలకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి అక్టోబర్-‌ 20 నాటికి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది.