కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి,ఆయన కొడుకు నిఖిల్ కి కరోనా
జనతా దళ్ సెక్యూలర్(JDS) నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు.
H D Kumaraswamy జనతా దళ్ సెక్యూలర్(JDS) నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలినట్లు ఆయనే స్వయంగా శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొద్దిరోజులుగా బసవకళ్యాణ్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కుమారస్వామి.. మార్చి 23న కొవిడ్ టీకా తొలిడోసు వేయించుకున్నారు.
నాకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ అయింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. లక్షణాలు ఏమైనా ఉంటే స్వతహాగా ఐసోలేషన్లోకి వెళ్లండి అని కుమారస్వామి తన ట్వీట్ లో పేర్కొన్నారు. కుమారస్వామి మరియు ఆయన భార్య రామనగర ఎమ్మెల్యే అనితా కుమారస్వామి డాక్టర్ల సూచన మేరకు హఓం క్వారంటైన్ లో ఉన్నారు.
ఇక, కుమారస్వామితో పాటు ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామికి కూడా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని నిఖిల్ కమారస్వామి స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసొలేషన్ లో ఉన్నట్లు నిఖిల్ తెలిపారు. తనను కొద్ది రోజులుగా కలిసినవారందరూ తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలని కోరారు. కాగా, కొద్దిరోజుల ముందే.. కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.