UP High Alert : గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ సోదరుల హత్యలతో.. యూపీలో హై అలర్ట్, 144 సెక్షన్ అమలు
యూపీలో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసు అధికారులు హై అలర్ట్గా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు కాపాడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

UP High Alert
UP High Alert : ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అష్రఫ్ను ముగ్గురు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి ప్రయాగ్రాజ్లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అతీక్ అహ్మద్, అష్రఫ్ను కాల్చి చంపారు. ఈ కాల్పులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ సోదరుల హత్యలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. యూపీలో హై అలర్ట్ ప్రకటించింది.
యూపీలో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసు అధికారులు హై అలర్ట్గా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు కాపాడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అతిక్ సోదరుల హత్యలపై పుకార్లను పట్టించుకోవద్దని యోగి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పుకార్లను ఎవరూ పట్టించుకోవద్దని, పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యోగి హెచ్చరించారు. అతీక్ అహ్మద్ సోదరుల హత్యలపై అర్థరాత్రి పోలీస్ ఉన్నతాధికారులతో యోగి అదిత్యనాథ్ సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన జరిగిన సమావేశానికి యూపీ హోంశాఖ కార్యదర్శి సంజయ్ ప్రసాద్, యుపి పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఆర్కె విశ్వకర్మ ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ నిందితుడిగా ఉన్నాడు. వైద్య పరీక్షల కోసం అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ ను పోలీసులు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడికి మీడియా వచ్చింది.
Atiq Ahmed : నిన్న కొడుకు నేడు తండ్రి.. గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ హతం
గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో వెనుక నుంచి కాల్పుల శబ్ధం వినిపించింది. దుండగులు నేరుగా అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ పై కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. పోలీసు కస్టడీలో ఉండగానే వారిపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పులకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.