2021లో ప్రపంచ కుబేరులని మించిన అదానీ సంపద
Gautam Adani భారత లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపాదన రాకెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. 2021లో.. ప్రపంచ కుబేరులైన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్లను మించి అదానీ ఆదాయాన్ని ఆర్జించారు. గడిచిన రెండు నెలల్లోనే 16.2 బిలియన్ డాలర్లు(సుమారు రూ.1.18 లక్షల కోట్లు) నికర ఆదాయాన్ని అదానీ ఆర్జించారని బ్లూమ్బర్గ్ బిలయనీర్ ఇండెక్స్ తెలిపింది. దీంతో ఈ ఏడాదిలో అత్యంత ఆదాయాన్ని ఆర్జించి ప్రపంచ కుబేరులందరినీ అదానీ వెనక్కి నెట్టారు. ఇక ఆసియాలోనే సంపన్నుడైన అంబానీ సంపాదన 2021లో 810 కోట్ల డాలర్లు (సుమారు రూ.59 వేల కోట్లు)గా ఉంది. అదానీతో పోలిస్తే ఇది సగమే.
ప్రస్తుతం వచ్చిన 16.2 బిలియన్ డాలర్ల ఆదాయంతో అదానీ సంపద 50 బిలియన్ డాలర్లు(సుమారు రూ.3.64 లక్షల కోట్లు)కి చేరుకుంది. పోర్టులు, ఎయిర్పోర్ట్లు,డాటా సెంటర్లు, రైల్వే స్టేషన్లు, బొగ్గు గనుల ద్వారా ఇంత ఎక్కువ స్థాయిలో అదానీ లాభాలు ఆర్జించారని బ్లూమ్బర్గ్ బిలయనీర్ ఇండెక్స్ తెలిపింది. ఈ మధ్యే డేటా సెంటర్ల బిజినెస్లోకి అడుగుపెట్టి టెక్నాలజీ రంగానికి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇండియాలో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సిద్ధమవుతోంది. ఇప్పటికే డాటా సెంటర్లలో లాభాల్లో దూసుకుపోతున్న అదానీకి ఇది మరింతగా కలిసి వస్తుందని బిజినెస్ పండితులు అంటున్నారు.
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన ప్రకారం.. ఈ ఏడాది ఒక్క కంపెనీ తప్ప మిగతా అన్ని అదానీ కంపెనీ షేర్లు 50 శాతం మేర పెరిగాయి. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ 96 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 90 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ 79 శాతం, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ 52 శాతానికిపైగా, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 12 శాతం పెరిగాయి.