ఉత్తరాఖండ్ విపత్తు : 12 కార్మికుల ప్రాణాలు కాపాడిన ఫోన్ కాల్

ఉత్తరాఖండ్ విపత్తు : 12 కార్మికుల ప్రాణాలు కాపాడిన ఫోన్ కాల్

Glacier burst ఉత్తరాఖండ్​లోలో ఆదివారం సంభవించిన ఆకస్మిక వరదలు కారణంగా చమోలీ జిల్లాలోని తపోవన్ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తోన్న కార్మికుల్లో కొంతమందికి ఓ మొబైల్ ఫోన్ లో సిగ్నల్ ఆశా కిరణమైంది. వరదల్లో చిక్కుకొని ప్రాణాలపై ఆశలు వదులుకున్న 12మంది కార్మికులకు ఓ మొబైల్​ ఫోన్లో నెట్​వర్క్​ సిగ్నల్​ చూసి..వెంటనే తాము సొరంగంలో చిక్కుకున్న విషయాన్ని పై అధికారికి తెలియజేశారు. ఆయన హుటాహుటిన అధికారులకు సమాచారం అందించారు. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన సహాయక బృందాలు దాదాపు 7 గంటల పాటు శ్రమించి 12 మంది కార్మికులను సొరంగం నుంచి క్షేమంగా బయటకు తీశాయి. అనంతరం జోషిమఠ్​లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఒక్క ఫోన్ కాల్​ తో తమకు కొత్త జీవితం లభించినట్లయిందని వారంతా ఆనందంతో మునిగి తేలుతున్నారు. సహాయక బృందాలు రక్షించిన 12మంది కార్మికుల్లో ఒకరైన లాల్ బహదూర్​ మాట్లాడుతూ..మమ్మల్ని సొరంగం నుంచి బయటకు రావాలని కొందరు పెద్దగా అరవడం మాకు వినిపించింది. కానీ మేము స్పందించే లోపే ఒక్కసారిగా భారీ వరద వచ్చింది. బురద మమ్మల్ని ముంచెత్తింది. కొన్ని గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపాం. చివరకు మమ్మల్ని సురక్షితంగా సహాయకబృందాలు రక్షించాయి అని తెలిపాడు.

మేం ఆశలు వదులుకున్నాం. కానీ కొంచెం వెలుతురు, గాలి వచ్చాక మాలో ఒకరి మొబైల్ ఫోన్లో సిగ్నల్ రావడం గమనించాం. వెంటనే అతను మా జనరల్ మేనేజర్​కు సమాచారం అందించాడు అని మరో కార్మికుడు తెలిపాడు. తమను కాపాడిన ఐటీబీపీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. వరద వచ్చినప్పుడు తాము సొరంగంలో 300 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు మరో కార్మికుడు, నేపాల్​ నివాసి బసంత్​ తెలిపాడు. సొరంగంలోకి నీరు చేరినప్పుడు పైకి రావడానికి ప్రయ్నతించడం తప్ప మరో గత్యంతరం లేదని చమోలిలోని ఢాక్ గ్రామానికి చెందిన మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెల్లడించాడు.

వరదల కారణంగా ప్రభావితమైన 9 గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాతున్నాయి. అక్కడి ప్రజలకు చాపర్ల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ వరదలో ఇప్పటి వరకు 18 మంది మరణించారు. మొత్తం 202 మంది గల్లంతయ్యారు. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉత్త‌రాఖండ్‌లోని నందాదేవి జాతీయ పార్కు వ‌ద్ద ఉన్న కొండ‌ల్లో ఉన్న గ్లేసియ‌ర్‌.. ఆదివారం ఒక్క‌సారిగా విరిగిప‌డ‌డంతో చ‌మోలీ జిల్లాలో ఉన్న న‌దుల్లో వ‌ర‌ద నీరు పోటెత్తడంతో రిషిగంగా ప‌వ‌ర్ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.